మళ్లీ మొదటికేనా !? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికేనా !?

Jun 8 2025 12:58 AM | Updated on Jun 8 2025 12:58 AM

మళ్లీ మొదటికేనా !?

మళ్లీ మొదటికేనా !?

కోరుట్ల: ధరణి పోర్టల్‌ లోటుపాట్లు సరిదిద్ది.. త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన భూ భారతి సదస్సులకు లెక్కలేని దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి భూముల సర్వే, మ్యాప్‌ అటాచ్‌తో సరిహద్దుల నిర్ణయం వంటి అంశాలను నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో అధికారుల కాలయాపన, అవినీతి తంతు వెంటాడే అవకాశం ఉండడంతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కుప్పలు తెప్పలు..

భూభారతి సదస్సులు మొదలై ఐదు రోజులు గడుస్తున్న క్రమంలో కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్లలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది విరాసత్‌, కోర్టు కేసులు, సాదాబైనామాలు, గ్రామకంఠం, ఆబాది వంటి భూ సమస్యలను వేర్వేరుగా నమోదు చేసి వాటి పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భూ భారతి ప్రకారం 60 నుంచి 90 రోజుల్లోగా సమస్యను బట్టి తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించాలి. ప్రస్తుతం ఐదు రోజులుగా సాగుతున్న సదస్సుల్లో దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తున్నాయి. నాలుగు రోజుల్లో కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఆరు మండలాల్లో 1800 దరఖాస్తులపైనే వచ్చాయి. మరో పది రోజుల గడువు ఉన్న క్రమంలో ఈ సంఖ్య 3వేల వరకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా ఆన్‌లైన్‌ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. ఈ క్రమంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు భూభారతి పోర్టల్‌లో సర్వే మ్యాప్‌ తప్పనిసరి. ప్రస్తుతం సర్వేయర్ల కొరత ఉన్న క్రమంలో మ్యాప్‌లను అనుసంధానించడంలోనూ ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న వాదనలు వినవస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు సదరు భూముల వద్దకు వెళ్లి విచారణ చేసి భూభారతిలో భూమి హక్కుల నమోదు చేయడానికి నిర్ణీత కాల పరిమితి ఉన్నప్పటికీ ఆ లోపు ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు పరిష్కారం వీలవుతుందా..? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ జాప్యం కారణంగా రెవెన్యూ సిబ్బంది చేతులుచాచే సంస్కృతికి ఎక్కడ తెరలేపుతారో అన్న అనుమానాలు దరఖాస్తుదారులను వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూభారతి చట్టం అమలుకు ఉన్నత స్థాయి అధికారులు మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

భూభారతి దరఖాస్తుల సర్వే తీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement