
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి
హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు

దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు