టాప్–100 కంపెనీలకు లాభాల పంట
ఏకంగా 679 బిలియన్ డాలర్ల ఆదాయం
జాబితాలో మూడు భారత కంపెనీలు
హెచ్ఏఎల్, బీఈ, ఎండీఎస్కు స్థానం
వాటి ఆదాయం రూ.67 వేల కోట్లు
ఎడాపెడా యుద్ధాలే ప్రధాన కారణం
స్టాక్హోం: 2024లో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీల పంట పండింది. ఉక్రెయిన్ మొదలుకుని గాజా దాకా నిర్నీరోధంగా సాగుతున్న యుద్ధాలే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచంలోని టాప్–100 ఆయుధ కంపెనీల ఆదాయంలో గతేడాది 5.9 శాతం మేరకు నికర పెరుగుదల నమోదైంది. స్టాక్హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్ఐపీఆర్ఐ–సిప్రీ) సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ మేరకు పేర్కొంది. ‘‘వాటి ఉమ్మడి ఆదాయం ఏకంగా 679 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ప్రాంతీయ ఉద్రిక్తలు పెచ్చరిల్లుతుండటం, దేశాలు పోటాపోటీగా ఆయుధ కొనుగోళ్లకు దిగుతుండటం, సైనిక వ్యయాన్ని ఎన్నడూ లేని స్థాయిలో అమాంతంగా పెంచేయడం దీనికి ప్రధాన కారణాలు’’అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టాప్–100లో మూడు భారత కంపెనీలుండటం విశేషం. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 44వ స్థానంలో, భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈ) 58, మడ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ (ఎండీఎస్) 91వ స్థానంలో నిలిచాయి. వాటి ఉమ్మడి ఆదాయం 8.2 శాతం పెరిగి ఏకంగా రూ.67 వేల కోట్లు (750 కోట్ల డాలర్లు) దాటేసింది!
ఏడేళ్లలో తొలిసారి
ముఖ్యంగా ప్రపంచంలోని టాప్–5 ఆయుధ కంపెనీలు లాక్హీడ్ మార్టిన్ (అమెరికా), ఆర్టీఎక్స్ (అమెరికా), నార్త్రాప్ గ్రూమన్ కార్పొరేషన్ (అమెరికా), బీఏఈ సిస్టమ్స్ (బ్రిటన్), జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ (అమెరికా) అన్నింటి ఆదాయమూ గతేడాది పెరుగుదల నమోదు చేసింది. ఇలా జరగడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఒక్క అమెరికా కంపెనీల ఆదాయం 3.8 శాతం పెరిగి 334 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
జాబితాలోని 39 కంపెనీలకు గాను 30 కంపెనీలు ఆదాయాన్ని భారీగా పెంచేసుకున్నాయి. ‘‘అమెరికా, యూరప్అని మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఆయుధ విక్రయాలు పైపైకి దూసుకెళ్లాయి. ఒక్క ఆసియా–ఓíÙయానా ప్రాంతంలో మాత్రమే ఇందుకు ఏకైక మినహాయింపు. అక్కడ కూడా చైనా అంతర్గత సమస్యలే అందుకు దారితీశాయి’’అని సిప్రి నివేదిక పేర్కొంది.
అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమాన ప్రాజెక్టు తదితరాలపై నెలకొన్న అయోమయం అక్కడి ప్రధాన ఆయుధ కంపెనీల్లో భవిష్యత్తు పట్ల అనిశ్చితికి దారి తీస్తోంది’’అని సిప్రీ నివేదిక వివరించింది. టాప్–100లో యూరప్ నుంచి 26 కంపెనీలున్నాయి. వాటిలో 23 ఆదాయంలో భారీ పెరుగుదలను చవిచూశాయి. ‘‘వాటి ఉమ్మడి ఆదాయం ఏకంగా 13 శాతం పెరిగి 151 బిలియన్ డాలర్ మార్కును దాటేసింది. ఉక్రెయిన్ యుద్ధం, ఆ దెబ్బకు రష్యా నుంచి తమకూ ముప్పు తప్పదేమోనని యూరప్ దేశాలు భారీగా ఆయుధ కొనుగోళ్లకు దిగడమే ఇందుకు కారణం’అని నివేదిక తెలిపింది.
రెండు రష్యా కంపెనీలు
టాప్–100 జాబితాలో రెండు రష్యా కంపెనీలు కూడా ఉండటం విశేషం. అవి రోస్టెక్, యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్. వాటి ఉమ్మడవి ఆదాయం 23 శాతం పెరిగి 31.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా అగ్ర దేశాలన్నీ ఎడాపెడా నిషేధాలు, ఆంక్షలు విధించినా ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషమే. దేశీయ డిమాండే ఇందుకు కారణమని సిప్రీ వెల్లడించింది. టాప్–100లో మధ్యప్రాచ్యం నుంచి తొలిసారి 9 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. అవన్నీ కలిసి 31 బిలియన్ డాలర్లు ఆర్జించాయి. 2023తో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం పెరుగుదల. ఇక టాప్–100లో చోటు దక్కిన మూడు ఇజ్రాయెల్ కంపెనీల ఉమ్మడి ఆదాయం 16 శాతం పెరిగి 16.2 బిలియన్ డాలర్లుగా తేలింది. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా తొలిసారిగా ఈ జాబితాలో చేరింది. 2023తో పోలిస్తే దాని ఆదాయం రెట్టింపుకు పైగా పెరిగి 180 కోట్ల డాలర్లుగా నమోదైంది.


