ఎయిరిండియా విమానాలపై నిషేధం | Covid19 Hong Kong bans Air India flights for two weeks | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానాలపై నిషేధం

Aug 18 2020 12:43 PM | Updated on Aug 18 2020 1:00 PM

Covid19 Hong Kong bans Air India flights for two weeks - Sakshi

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కాలంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశాలకు చేరవేస్తున్న ఎయిరిండియా విమాన సర్వీసులకు హాంకాంగ్ లో ఎదురు దెబ్బ తగిలింది. భారతదేశం నుంచి వస్తున్నఎయిరిండియా విమాన ప్రయణీకుల ద్వారా వైరస్ సోకుతోందన్న కారణంగా నగరంలోకి ఎయిరిండియా సర్వీసులను రెండు వారాల పాటు నిషేధించింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఆగస్టు18 నుండి ఆగస్టు 31 వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. 

ఆగస్టు 14న న్యూఢిల్లీనుంచి వచ్చిన వారిలో 11 మందికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీ-ఫ్లైట్ పరీక్షలు పేలవంగా ఉన్నాయని ఆరోపించింది. ఒకే విమానంలో11 మందికి వైరస్ నిర్దారణ కావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్న హాంకాంగ్ ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో ల్యాండ్ కావాల్సిన ఎయిరిండియా చార్టర్ విమానానికి అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంక్షల కారణంగా 2020 ఆగస్టు 18 నాటి విమానం వాయిదా పడిందనీ, సంబంధిత విరాలను త్వరలో తెలియచేస్తామని ట్వీట్ చేసింది. 

కాగా జూలై 25 నుండి, తమ నగరానికి చేరే విమాన ప్రయాణీకులకు ప్రీ-బోర్డింగ్ సర్టిఫికెట్లు తప్పని సరిచేసింది. భారతదేశం, అమెరికా సహా తొమ్మిది అధిక ప్రమాదకర దేశాల నుండి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటలలోపు ఇది తీసుకోవాలి. అలాగే వచ్చినవారు తర్వాత స్వీయ నిర్బంధం కోసం కనీసం రెండు వారాల పాటు హోటల్ బుక్ చేసుకున్న పత్రాలను కూడా సమర్పించాలనే నిబంధనను కూడా హాంకాంగ్ ప్రభుత్వం విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement