China Corona: రెండున్నర కోట్ల మంది దిగ్భందం.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు

China Corona Updates: Shanghai Lockdown Shocked World - Sakshi

కరోనా పుట్టుకకు చైనానే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆరంభంలో వైరస్‌ విజృంభించినా.. అంతే వేగంగా వైరస్‌ను అదుపు చేసింది.  అయితే రెండేళ్ల పాటు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంటే.. చైనా మాత్రం జీరో టోలరెన్స్‌ పేరిట హడావిడి చేసింది. ఈ తరుణంలో ప్రపంచాన్ని నివ్వెరపరస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. 

షాంగై.. రెండున్నర కోట్ల జనాభా ఉన్న మహానగరం. అధిక జనసాంద్రతతో పాటు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటి. అలాంటి నగరం మూగబోయింది. మనుషులు, పశువులు రోడ్డెక్కడం లేదు. కఠిన లాక్‌డౌన్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిత్యావసరాలు, ఆస్పత్రి సేవలు సకాలంలో దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరసనల గళం వీలైన రీతిలో వినిపిస్తున్నారు. రోబోలతో వీధుల వెంట కరోనా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది చైనా ఇప్పుడు. సోమవారం నుంచి షాంగైలో ఇది మొదలైంది. షాంగైలో ప్రతి నలుగురిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తుండడంతో..  ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కుక్కల ఓనర్లు వాటికి తాళ్లు కట్టి కిందకి దించి.. కాలకృత్యాలు తీర్చడం, ఒక బిల్డింగ్‌ నుంచి మరొక బిల్డింగ్‌కు సరుకుల రవాణా తాళ్ల సాయంతో చేయడం, చెత్తను విసిరేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, స్మార్ట్‌ ఫోన్లలోనే ముఖ్యమైన పనులు, ప్రజల కోసం డ్రోన్ల సాయం.. ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. 

కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఆఖరికి విధుల్లోనూ పోలీసులు భాగం కావడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థంచేసుకోవచ్చు. రోబోలతోనే పాట్రోలింగ్‌ చేయిస్తున్నారు. నిశబ్దమైన రోడ్ల మీద అప్పుడప్పుడు ఆంబులెన్స్‌ సౌండ్‌ తప్ప మరేమీ వినిపించడం లేదు.  వెరసి.. షాంగై ఇప్పుడు ఘోస్ట్‌ టౌన్‌ను తలపిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top