బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించాలి

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించాలి

బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించాలి

న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్‌సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, ఎన్‌హెచ్‌ పరిధిలో ఉన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేయాలని సూచించారు. రోడ్లలో లోపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరంగల్‌ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా సరైన లైటింగ్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మున్సిపల్‌ అధికారులకు తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నివారణపై

అవగాహన కల్పించాలి

మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం జరిగిన జిల్లా నార్కోటిక్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులకు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించాలని సూచించారు. అదేవిధంగా స్ఫూర్తి కార్యక్రమంలో నార్కోటిక్‌ అధికారులను భాగస్వామ్యం చేసి విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు.

రోడ్‌సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ సత్యశారద

Advertisement
 
Advertisement
Advertisement