
‘గ్రేటర్’లో ఇలా..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థ.. పన్నులు పెంచుకునే దిశగా ముందడుగు వేసింది. డ్రోన్లతో నగరంలోని నివాసిత, వాణిజ్య ప్రాంతాలు, ఖాళీ స్థలాలను(వీఎల్టీ) అంగుళమంగుళం పక్కాగా గుర్తించేందుకు చర్యలు చేపట్టనుంది. ఆధునిక పద్ధతులు, డిజిటల్ పటాల ద్వారా సర్వే చేసి ప్రాంతాల విభజన పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 నిధులు రూ.6కోట్లు కేటాయిస్తూ సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే జీడబ్ల్యూఎంసీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే ఏటా మరో రూ.20 కోట్లు వసూలయ్యే అవకాశముంది.
ప్రత్యేక ఏజెన్సీకి..
వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ఆస్తిపన్ను కింద ఏటా రూ.100కోట్ల ఆదాయం వస్తోంది. 2,19,869 అసెస్మెంట్లు(ఇళ్ల) నుంచి ఈ ఆదాయాన్ని సేకరిస్తున్నారు. సవరిస్తే ఆదాయం మరో రూ.25 కోట్ల మేరకు పెరిగే అవకాశం ఉందని కొన్నేళ్లుగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డ్రోన్ సర్వే విజయవంతమైంది. ఆదాయం మెరుగైంది. ఈ విధానం జీడబ్ల్యూఎంసీ పరిధిలో చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ 2.0 నిధులు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 6 కోట్లను డ్రోన్సర్వే మ్యాపింగ్ కోసం కేటాయించారు. త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేయనున్నారు.
రట్టుకానున్న పన్నుల ‘గుట్టు’..
ఆస్తిపన్ను మదింపులో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు తమ ఇంటిని కొంత భాగం వ్యాపార అవసరాలకోసం అద్దెకిస్తున్నారు. మరికొందరు జీడబ్ల్యూఎంసీ సిబ్బందితో కుమ్మకై ్క ఇంటి, ఖాళీ స్థలం విస్తీర్ణాన్ని, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలను తేడాలు చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, భవనాలపై అదనపు అంతస్తులు నిర్మిస్తూ దానికి పన్ను చెల్లించడం లేదు. ఖాళీ స్థలాలను పన్ను పరిధిలోకి తీసుకోవడం లేదు. ఇలాంటి వాటితో పన్ను ఆదాయం భారీఎత్తున కోల్పోతున్నామని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సమగ్ర సర్వేలో కొన్ని వివరాలను తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ ఇంటిలో, అపార్ట్మెంట్లో ఎన్ని అంతస్తులు? ఎన్ని గదులున్నాయి? ఆ ఇల్లు పూర్తిగా గృహ అవసరాల కోసమా, అద్దెకా, వ్యాపార కోసం వినియోగిస్తున్నారా, ట్రేడ్ లైసెన్స్లు, కమర్షియల్ నల్లాలు ఎన్ని ఉన్నాయనే వివరాలను డ్రోన్ల సహాయంతో నిగ్గు తేల్చనున్నారు. ఆ దిశగా విస్తీర్ణానికి అనుగుణంగా పెరిగే పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు.
రూ.6 కోట్లతో టెండర్కు గ్రేటర్
వరంగల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్
జీడబ్ల్యూఎంసీకి పెరగనున్న
రూ.25 కోట్ల అదనపు ఆదాయం
మహా నగర విస్తీర్ణం
407.7చదరపు కిలోమీటర్లు
2025 జనాభా
11.50లక్షలు అంచనా
మొత్తం అసెస్మెంట్లు
2,19,868లక్షలు
ఆస్తిపన్ను ద్వారా ఆదాయం
రూ.100కోట్లు
తాజా డ్రోన్ సర్వే ద్వారా
రూ.25కోట్ల మేరకు
ఆదాయం పెరుగుతుందని అంచనా