
చౌరస్తా విస్తరణలో జాప్యం
కాజీపేట: కాజీపేట చౌరస్తా విస్తరణలో జాప్యం కారణంగా వాహనదారులకు అవస్థలు తప్పట్లేదు. నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల్ని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది ఉంటే తప్ప.. వాహనదారులు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్డు నిర్మించాక ఈమార్గంలో ప్రయాణించే వాహనాలు అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు వరంగల్ మీదుగా ఉన్న జాతీయ రహదారులను చేరుకునేందుకు సైతం ఈరోడ్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాజీపేట చౌరస్తా సమీపంలో షాపులు, రోడ్లపై నిలిపిన వాహనాల కారణంగా ఆప్రాంతంలో నిత్యం వాహనాలు బారులుదీరుతున్నాయి. చౌరస్తా ఇరుకుగా ఉండడం.. ఓ వైపు స్తంభాలు, దుకాణాల ర్యాంపులు, మెట్లు, ముందుకు జరిపేసిన షెడ్లు.. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన చిరువ్యాపారుల బండ్ల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి
మున్సిపల్, ‘కుడా’ అధికారులు వరంగల్ నగరంలో చౌరస్తాల విస్తరణ, సుందరీకరణ చేపట్టాలని 2022లో నిర్ణయించారు. ఆజాబితాలో కాజీపేట చౌరస్తా సైతం ఉంది. అదే ఏడాది సర్వే చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. పనులు మంజూరయ్యేలోపు తాత్కాలిక చర్యలు చేపట్టాలని కోరారు. చౌరస్తాను జీరో సర్కిల్ ఆకారంలో నిర్మించాలని, విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాలు, రైల్వే స్టేడియం, త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్, పోలీస్స్టేషన్ ప్రహరీని తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది గడిచి మూడేళ్లవుతున్నా.. పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. చౌరస్తా విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాల తొలగింపు విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది.
నిధులు మంజూరైనా..
ఎట్టకేలకు ఈఏడాది చౌరస్తా అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చౌరస్తాలో క్రాస్ డివైడర్ కట్టి వివిధ ఆకారాల్లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముసుగులు వేసి వదిలేశారు. అసలే ఇరుకుగా ఉన్న చౌరస్తా కావడంతో పాటు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్దకు నిత్యం వచ్చే వారి వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. చౌరస్తా సమీపంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానులు సెట్బ్యాక్తో నిర్మాణాలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది.
వేలాది వాహనాలు..
కాజీపేట పట్టణ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలు జిల్లాలను అనుసంధానం చేసే రహదారి ఇదొక్కటే కావడం గమనార్హం. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు ఇప్పటికై నా స్పందించి చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.
విస్తరిస్తేనే సమస్యకు పరిష్కారం
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాజీపేట చౌరస్తా విస్తరణ పనులను అధికారులు పూర్తి చేయాలి. చౌరస్తా ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉండడంతో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
– పిల్లల సుధాకర్, వ్యాపారి
ప్రజలు సహకరించాలి..
రహదారి విస్తరణకు వందశాతం ప్రయత్నాలు మొదలు పెట్టాం. నిధులకు ఇబ్బంది లేదు. చౌరస్తాకు అటూఇటుగా ఉన్న భవనాల తొలగింపు సమస్యే ప్రధాన అడ్డంకిగా మారింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు సహకరిస్తే పనులు ప్రారంభమవుతాయి.
– నాయిని రాజేందర్రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే
కాజీపేటలో నిత్యం ట్రాఫిక్ చిక్కులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు

చౌరస్తా విస్తరణలో జాప్యం

చౌరస్తా విస్తరణలో జాప్యం