
డీపీఆర్ త్వరగా సిద్ధం చేయండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీగా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటాయింపు, తదితర అంశాలపై వివరించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఈఈలు, డీఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి..
వరంగల్ చౌరస్తా: వరంగల్ రామన్నపేట 28వ డివిజన్లో మేయర్ సుధారాణి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంగళవారం పర్యవేక్షించారు. పాత థియేటర్ వద్ద డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మేయర్ ఇంజనీర్లను, ప్రజారోగ్య విభాగాధికారులను మందలించారు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీర్లు ఉన్నారు.