
క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయం
వరంగల్ స్పోర్ట్స్/హన్మకొండ అర్బన్ : క్రీడల ప్రాధాన్యతను గుర్తించి తల్లిదండ్రులు వారి పిల్ల లను నచ్చిన క్రీడల్లో ప్రోత్సహించడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 35 రోజులపాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గురువారం ముగిశాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బాస్కెట్ బాల్ గ్రౌండ్లో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్ స్టేడియంతోపాటు సుబేదారిలోని కలెక్టర్ నివాసంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు 2,500 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. 35 రోజుల పాటు జరిగిన శిబిరంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ శిక్షణ పొందారన్నారు. అనంతరం శిక్షణ పొందిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్ఓ గణేష్, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ లక్ష్మీరమాకాంత్, శ్రీనివాస్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, వివిధ క్రీడాసంఘాల బాధ్యులు, డీఎస్ఏ కోచ్లు తదితరులు ఉన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం