ఆక్రమణల వెల్లువ!

30ఫీట్ల రహదారికి అడ్డంగా నిర్మించిన 
ప్రహరీ(సర్కిల్‌లో) - Sakshi

వరంగల్‌: ఏనుమాముల ప్రాంతంలో భూకబ్జా గ్యాంగులు పాల్పడుతున్న ఆక్రమణలు చీమల పుట్టల్లా తయారైన విషయాన్ని టాస్క్‌ఫోర్స్‌ బృందం గుర్తించింది. ఈ మేరకు బుధవారం క్షేత్రస్థాయిలో ప్లాట్లను పరిశీలించి రూడీ చేసుకున్నట్లు సమాచారం. 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త, మాజీ జెడ్పీటీసీ తూర్పాటి సారయ్య, మాజీ కారోబార్‌ రఘు, శ్రీనివాస్‌, జంగం రాజు, గండ్రతి భాస్కర్‌లను భూఆక్రమణ ఫిర్యాదులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించి రాత్రి వదిలేసిన విషయం తెలిసిందే. విచారణలో తాము ప్లాట్లను కొనుగోలు చేశామని, ఆక్రమించుకోలేదని చెప్పడంతో క్షేత్రస్థాయిలో పర్యటించి అసలు విషయాలను తెలుసుకోవాలని సీపీ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీసీపీ కరుణాకర్‌, మామునూరు ఏసీపీ కృపాకర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏపీపీ జితేందర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసరావు, మహేందర్‌రెడ్డిలు క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పదుల సంఖ్యల్లో బాధితులు వారిని కలిసి ఫిర్యాదులు చేశారు. ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఇరువర్గాలను కాంప్రమైజ్‌ చేసి కేసును నీరుగార్చేందుకు రాష్ట్రస్థాయి నేతలతో పోలీసులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కబ్జారాయుళ్లకు గుణపాఠం చెప్పకుంటే ఏనుమాముల ప్రాంతంలో భూకబ్జాల దందా ఇంకా పెట్రేగిపోతుందన్న భయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుల స్వీకరణ...

తమ ప్లాట్లను ఆక్రమించుకున్నారని పలువురు బాధితులు టాస్క్‌ఫోర్స్‌ ముందు ఏకరువు పెట్టారు. వారిని స్టేషన్‌ వచ్చి ఫిర్యాదులు అందించాలని పోలీసులు సూచించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో బాధితులనుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు సాయంత్రం బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రావాలని, అక్కడే నిగ్గు తేలుస్తామని చెప్పినట్లు సమాచారం. అక్కడ సీపీ నేతృత్వంలో విచారణ జరుగుతుందని చెప్పారు. కాగా, ఇప్పటికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసి స్టేషన్ల చుట్టూ తిరిగి వేసారిన బాధితులు సీపీ రంగనాథ్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.

అందరొక్కటై అమ్ముకున్నారు..

డివిజన్‌లోని సర్వేనంబర్‌ 259లోని ప్రతాపరుద్ర కాలనీ 3వ లైన్‌లో 100ఫీట్ల రోడ్డుకు అనుసంధానంగా ఉన్న 30ఫీట్ల రోడ్డును మూడేళ్ల క్రితం చిలుక భాస్కర్‌, బాలాజీ కుమారస్వామి, జానీ అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారు. దీనిపై పోలీసులకు, గ్రేటర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో 2020 సెప్టెంబర్‌ 30న రెస్క్యూ టీం వచ్చి జేసీబీతో కూల్చివేశారని స్థానికులు తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత యథావిధిగా గోడ నిర్మించి షెడ్‌గా మార్చారని, ఈవిషయంపై ఆక్రమించుకున్న వారిని కాలనీ వాసులం ప్రశ్నిస్తే ‘మీ దిక్కున్న కాడా చెప్పుకోండి’అంటూ ఎగతాళి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు అప్పటి కూల్చివేతకు సంబంధించని వీడియోతో పాటు 22మంది సంతకాలతో కూడి వినతిపత్రాన్ని పోలీస్‌ అధికారులకు అందజేశారు. ప్లాన్‌లో ఉన్న రహదారికి అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి కాలనీ నుంచి 100ఫీట్ల రోడ్డుకు వెళ్లేందుకు దారి కల్పించారని విజ్ఞప్తి చేశారు. స్పందించిన డీసీపీ వెంటనే అక్రమణలకు పాల్పడిన ముగ్గురిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారిని కార్యాలయంలో గురువారం హా జరు పర్చాలని ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ను ఆదేశించినట్లు కాలనీవాసులు తెలిపారు.

క్షేత్రస్థాయిలో గుర్తించిన

టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

ఏనుమాములలో పోలీసులకు

బాధితుల ఏకరువు

ప్రతాపరుద్ర కాలనీలో రోడ్డు

అక్రమణపై ఫిర్యాదు

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top