దుర్గమ్మ సన్నిధిలో
విశేష అభిషేకాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం విశేష అభిషేకాలు జరిగాయి. సంకట హర చతుర్థిని పురస్కరించుకుని దేవస్థాన యాగశాలలో గణపతికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, గణపతి హోమం నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు గణపతి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. గణపతి హోమం నిర్వహించగా, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్లతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నామమాత్రంగానే ఉండగా, ఉదయం పది గంటల తర్వాత కాసింత పెరిగింది. మరో వైపున ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మహా నివేదన అనంతరం 12.20 గంటలకు దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో కాసింత భక్తుల తాకిడి కనిపించింది. ఆదివారం భక్తుల రద్దీ అంతంత మాత్రంగా ఉన్నా మహా మండపంలోని లిఫ్టులను ఐదో అంతస్తు వరకు మాత్రమే అనుమతించడంపై భక్తుల నుంచి ఫిర్యాదులందాయి.
లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయ దాతలు సేవలో పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడిలో వేసవి చలువ పందిళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 14 లక్షల అంచనాలతో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆలయ అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అమ్మవారి ఆలయం ఎదుట, రాజగోపురం ఎదుట కళావేదిక, ఘాట్రోడ్డు, కనకదుర్గనగర్, నటరాజ స్వామి వారి ఆలయం, లక్ష్మీగణపతి విగ్రహం తదితర ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో త్వరితగతిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో శీనానాయక్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
నిత్యాన్నదానానికి
రూ. లక్ష విరాళం
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి వాస్తవ్యులు సుసర్ల వెంకట శశికృష్ణరాఘవ, జయ నందిని దంపతులు ఆదివారం రూ. 1,00,111 విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భక్తుల రద్దీ సాధారణం
సూర్యోపాసన సేవ