
విద్యారంగంలో అసంబద్ధ విధానాలపై ఆందోళన
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవ లింగారావు
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు నిరసనగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి ఆందోళన, పోరాటాలు చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవలింగారావు, మొహమ్మద్ ఖాలీద్ పేర్కొన్నారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 117 జీవోను రద్దు చేసి, పాఠశాల విద్యను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుగా పూర్వస్థితికి మార్చుతామని చెప్పిన ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు కొనసాగించడమే కాకుండా కొన్నిచోట్ల ఒకటి నుంచి టెన్త్ వరకు తరగతులు నిర్వహిస్తామని చెప్పడం ఉపాధ్యాయ, విద్యార్థిలోకాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను తీసుకురావడం ద్వారా విద్యారంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలకు ఈనెల 5న తేదీ పాత తాలుకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, మే 9న జిల్లా కేంద్రంలో ధర్నా, మే14 న విజయవాడలో రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం 12 డిమాండ్స్ పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.ఎస్.ఎన్. మూర్తి, జి.దాస్, జిల్లా కౌన్సిలర్లు పి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వర్లు, గురుమూర్తి, జహంగీర్, షూకూర్, మాలకొండయ్య పాల్గొన్నారు.