
స్పౌజ్ పేరిట కొత్త మెలిక
నెహ్రూనగర్: వితంతువులకు పింఛన్లు మంజూరు చేసి వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు చేపట్టింది. వితంతు పింఛన్ల మంజూరును ఓ తంతుగా మార్చింది. స్పౌజ్ కేటగిరీలోనే పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేస్తోంది. ఏదైనా కేటగిరీలో పింఛన్ పొందుతున్న భర్త మృతి చెందితే, అతని భార్యకు మాత్రమే పింఛన్ మంజూరు చేసేలా నిబంధనలు విధించింది.
దరఖాస్తులు స్వీకరిస్తే ఒట్టు
కూటమి అధికారం చేపట్టిన తరువాత కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కనీసం అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించిన పాపాన పోలేదు. తాజాగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతు పింఛన్ల మంజూరు అంటూ అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే ఇక్కడా ఓ మెలిక పెట్టింది. ఏదైనా కేటగిరీలో పింఛన్ పొందుతూ భర్త మరణించిన భార్యకు స్పౌజ్ కేటగిరీ పేరుతో పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. అది కూడా నిర్ధిష్ట కాలానికి మాత్రమేనని మెమోలో స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతూ డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్య చనిపోతే అతని భార్యను స్పౌజ్ కేటగిరీ కింద అర్హురాలిగా గుర్తిస్తారు. అక్టోబర్ తర్వాత భర్త మరణించిన మహిళకు పింఛన్ లేనట్లే. ఇది కూటమి ప్రభుత్వం వితంతు పింఛన్లకు విధించిన షరతు. ఇక సాధారణంగా ఎటువంటి సామాజిక పింఛన్ పొందని వారి కుటుంబాల్లో భర్త చనిపోయినా వారికి వితంతు పింఛన్ మంజూరు ఇప్పట్లో లేనట్లేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.
50 ఏళ్లకే పింఛన్ అమలు హుళ్లక్కే!
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,52,715 మందికి పింఛన్లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో సుమారు 7వేల దాకా పింఛన్లు ఆగిపోయాయి. ప్రస్తుతం స్పౌజ్ కేటగిరీ కింద 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,437 మంది పింఛన్దారులు చనిపోయారని, వారి భార్యలు స్పౌజ్ కేటగిరీ కింద సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ 50 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి నుంచి ప్రభుత్వం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు.
వైఎస్సార్ సీపీ హయాంలో...
గత ప్రభుత్వం వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిం సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసింది. 50 ఇళ్లకో వలంటీర్ను నియమించి ఆయా కుటుంబాల్లో అర్హత ఉన్న వారిని పథకాలకు దరఖాస్తు చేయించేవాళ్లు. 35 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలకు భర్త చనిపోతే ఆ మరుసటి నెలలోనే వితంతు పింఛన్ అందించేవారు.
కూటమి ప్రభుత్వంలో ఇలా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క సామాజిక పింఛన్ కూడా మంజూరు కాలేదు. పది నెలలుగా దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. పైగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతువులకు నిబంధనలు విధించడంతో అర్హత కలిగిన వితంతువులు పింఛన్లు పొందలేని పరిస్థితి నెలకొంది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు వారం వారం అర్హులు ప్రభుత్వ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఎదురుచూపులు తప్పేలా లేవు
వితంతు పింఛన్ అర్థమే
మార్చివేసిన కూటమి ప్రభుత్వం
ఏ దేనీ పింఛన్ పొందుతూ
మృతిచెందిన భర్త స్థానంలోనే
భార్యకు పింఛన్
2023 డిసెంబర్ 1 నుంచి 2024
అక్టోబర్ 31 మధ్య చనిపోయిన వారి
భార్యలే దరఖాస్తు చేయాలంటూ
మెలిక
స్పౌజ్ కేటగిరీ పేరుతో
వితంతు పింఛన్లు మంజూరు
ఈ నెలఖారులోగా దరఖాస్తు చేసుకోవాలి
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం స్పౌజ్ కేటగిరీ కింద 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,437 మంది పింఛన్దారులు చనిపోయారు. వారి భార్యలు స్పౌజ్ కేటగిరీ కింద సచివాలయంలో ఈ నెలఖారులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– విజయలక్ష్మీ, పీడీ, డీఆర్డీఏ