
ఎండీయూ వాహనాల ఆపరేటర్ల ప్లకార్డుల ప్రదర్శన
తెనాలి: ఎండీయూ వాహనాల ఆపరేటర్లు తమకు న్యాయం జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆపరేటర్లు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను తెలియజేసే ప్లకార్డులతో సహా అయితానగర్కు చేరుకున్నారు. ఆయనకు వినతిపత్రం అందజేసి, తమ గోడును విన్నవించుకోవాలని ఆశించారు. కిక్కిరిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మాజీ సీఎం కాన్వాయ్ను అనుసరించటంతో సాధ్యపడలేదు. దీనితో స్థానిక లింగారావు సెంటర్లో కారులోంచి బయకొచ్చి అభివాదం చేస్తున్న మాజీ సీఎం దగ్గరకు ప్లకార్డును తీసుకెళ్లారు. ప్లకార్డును పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లకార్డును తన చేతికి తీసుకుని ప్రదర్శించారు. అయితానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో అక్కడ జనంలోనూ ఈ ప్లకార్డులను ప్రదర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామని ఆపరేటర్లు చెప్పారు.