గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల తొలిరోజు సోమవారం విద్యార్థులు అవస్థలు పడ్డారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ రద్దీతో సమయానికి పరీక్షకు వెళ్లగలమా లేదా అని ఆందోళన చెందడం కనిపించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 27,506 మంది విద్యార్థులకు 27,350 మంది పరీక్షకు హాజరయ్యారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు బ్రాడీపేటలోని శారదానికేతన్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్ పరీక్షల జిల్లా పరిశీలకురాలు పి.పార్వతి ఎనిమిది, ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి రెండు, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఐదు చొప్పున పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు జిల్లా వ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 147 మంది ప్రైవేటు విద్యార్థుల్లో 105 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎనిమిది కేంద్రాల్లో జరిగిన దూరవిద టెన్త్ పరీక్షలకు 12 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది హాజరయ్యారు.
రోల్ నంబర్లు వేయకపోవడంతో గందరగోళం
గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో రెగ్యులర్తోపాటు దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. అయితే రోల్ నంబర్లు వేయకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. అదే సమయంలో రెగ్యులర్ టెన్త్ ప్రశ్నపత్రాలను తీసుకువచ్చేందుకు చీఫ్ సూపరింటెండెంట్ స్టోరేజి పాయింట్కు వెళ్లడంతో దూరవిద్య పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోవిందయ్య తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తల్లిదండ్రులు డీఈఓ సీవీ రేణుకకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎంఈఓ అబ్దుల్ ఖుద్దూస్ను పంపించారు. విచారణ జరిపిన ఎంఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా గోవిందయ్యను పరీక్షల విధుల నుంచి డీఈఓ తొలగించారు.
తొలిరోజు హడావుడి, ఆందోళన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థుల అవస్థలు గుంటూరులో రోల్ నంబర్లు వేయకపోవడంతో తల్లిదండ్రుల నిలదీత చీఫ్ సూపరింటెండెంట్ నిర్లక్ష్య సమాధానం విచారణ అనంతరం విధుల నుంచి తొలగింపు తెనాలిలో ఓ విద్యార్థికి కాంపోజిట్ పేపర్ బదులు తెలుగు పేపర్
ఒక పేపరుకు బదులు.. మరొక పేపర్
తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం మున్సిపల్ హైస్కూల్ కేంద్రంలో ఓ విద్యార్థికి 70 మార్కుల తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం (03టీ)కి బదులుగా ఇన్విజిలేటర్ 100 మార్కులకు తెలుగు ప్రశ్నపత్రం (01టీ) ఇచ్చారు. విద్యార్థిని జవాబులు రాసి, పరీక్ష ముగిసిన తరువాత ఈ విషయాన్ని పరీక్ష కేంద్ర నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రశ్నపత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసి, సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సీఎస్, డీవోలను ఆదేశించారు. విద్యార్థినికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని, ఆమె రాసిన ఆన్సర్ షీట్ను వాల్యూయేషన్ చేయిస్తామని డీఈఓ సీవీ రేణుక చెప్పారు. ఈ రెండు ఘటనలు మినహా జిల్లాలో పరీక్షలు సజవుగా జరిగినట్లు ఆమె పేర్కొన్నారు.