
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి రంగ విధానాలు రైతాంగ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో జల వన రులు పుష్కలంగా ఉన్నా వాటిని వ్యవసాయానికి మళ్లించడంలో పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా సాగు నీటి సమస్య కొనసాగుతూ వస్తున్నది. రైతుల ఆందోళన ఫలితంగా సాగు, తాగు నీరు కోసమంటూ కొన్ని నీటి పథకాలు చేపట్టి దశాబ్దాలు గడిచినా అవి ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, విజయనగరం జిల్లా లలో కొన్ని ప్రాంతాలు కరవు పీడిత ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. పాలకుల విధానాల పట్ల రైతాంగంలో వ్యతిరేకత వ్యక్తమైన ప్రతి సందర్భంలో కొత్త సాగు నీటి పథకాలను ముందుకు తెస్తున్నారు.
అందులో భాగమే కొత్తగా తెర మీదకు వచ్చిన పోల వరం – బనకచర్ల ఎత్తిపోతల లింక్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ప్రాతాలకు సాగు నీరు, తాగు నీరు అందించటం లక్ష్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం తాజాగా ‘జల హారతి కార్పొరేషన్ లిమిటెడ్’ అనే సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించటానికి మోదీ ప్రభుత్వంతో రాజీపడిన చంద్రబాబు ప్రభుత్వంపై రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలందరిలో తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది.
దీని నుంచి ప్రజలను పక్క దారి పట్టించడానికి అకస్మాత్తుగా ముందుకు తెచ్చిందే ఈ పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్. శ్రీశైలం కుడి కాల్వ ప్రాజెక్టులో భాగమైన బనక చర్ల రెగ్యులేటర్ ఉన్న ప్రదేశమే కడప జిల్లా జమ్మల మడుగులో ఉన్న బనకచర్ల. ఈ ప్రాజెక్టు అనుసంధా నానికి రూ. 81,900 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ అనుసంధానం ద్వారా 12.4 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు, 400 వందల కిలోమీటర్ల పొడవునా ఉన్న గ్రామాలకు తాగు నీరు, 340 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం 54 వేల ఎకరాల భూమి అవసరమని పేర్కొంది.
ఈ ప్రాజెక్టును నీటిపారుదల అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో పోలవరం నుండి తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల వరకు 18 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్తో ప్రకాశం బ్యారేజ్కు నీటిని విడుదల చేస్తారు. రెండవ దశలో ప్రకాశం బ్యారేజ్ నుండి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు 23 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. మూడవ దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్ల రెగ్యులేటర్కు 23 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. మూడో దశ చాలా క్లిష్టమైనదిగా సాగు నీటి రంగ నిపుణులు చెబు తున్నారు. నల్లమల పులుల అభయారణ్యంలో 34 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 2005లో ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు రెండు సొరంగాల తవ్వకం పనులు నత్తనడకన నడుస్తూ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును మోదీ ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా 119.4 టీఎమ్సీల నీరు మాత్రమే నిల్వ సాధ్యం. కుడి కాల్వ కింద మూడు లక్షల ఎకరాలకు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎక రాలకు కూడా ఈ నీరు సరిపోదనీ, అలాంటప్పుడు బనకచర్లకు నీటిని తరలించటం ఎలా సాధ్యమనీ సాగునీటి నిపుణులు అంటున్నారు. ప్రస్తుతంరాష్ట్రంలో వెలుగొండ, వంశధార రెండవ దశ, వంశధార – నాగావళి అనుసంధానం, మహేంద్ర తనయ, గజపతి నగరం బ్రాంచి కాల్వ వంటి 59 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే నిర్మాణాలు పూర్తయ్యి రైతుల కష్టాలు తీరతాయి.
బనకచర్ల ప్రాజెక్టును వరద నీటిని ఉపయోగిం చుకోవటానికి నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటు న్నారు. కానీ, వరద నీరు లభ్యత భారీ వర్షాలపై ఆధారపడి ఉంటుంది. వరదలు రాకపోతే నీరు లభించదు. అటువంటి ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చు చేయటం ఏ మాత్రం సరైన విధానం కాదు. భారీ ఖర్చుతో కూడిన బనకచర్ల ఆలోచన మాని, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసి, నిర్మాణంలో ఉన్న మిగిలిన ప్రాజె క్టులను కూడా పూర్తి చేసి... సాగు, తాగునీరు అందించాలని యావ న్మంది రైతాంగం, ప్రజలు ఉద్యమించాలి.
వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.)
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526