ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందని మీరు సంబరపడుతున్నారా? కానీ వాస్తవానికి ఆ అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే మిమ్మల్ని బందీని చేస్తోందని మీకు తెలుసా? సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ను మాత్రమే తయారుచేయడం లేదు; అవి మన ప్రమేయం లేకుండానే మనల్ని బానిసలుగా మార్చే ‘డిజిటల్ డ్రగ్స్’ను డిజైన్ చేస్తున్నాయి. దీనినే నిపుణులు ‘అడిక్షన్ ఎకానమీ’ అని పిలుస్తున్నారు.
మీ సమయమే వారి పెట్టుబడి!
సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే మనం డబ్బులు చెల్లిస్తాం. కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని మనం భ్రమపడుతుంటాం. ఒక వస్తువుకు మీరు డబ్బు చెల్లించడం లేదంటే, అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. మీ సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సమాచారమే వారి పెట్టుబడి.
మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్న ప్రతి అదనపు నిమిషం ఈ కంపెనీల పాలిట ఒక బంగారు గుడ్డు. మీరు ఎంత ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోతే, ఆ కంపెనీల షేర్ల విలువ అంతగా పెరుగుతుంది. 2026 ముగిసే నాటికి సోషల్ మీడియా యాడ్ మార్కెట్ సుమారు రూ.26 లక్షల కోట్లకు చేరుకోనుందంటే, మన ఏకాగ్రతను వారు ఎంత ఖరీదైన వస్తువుగా మార్చారో అర్థం చేసుకోవచ్చు. మెటా, గూగుల్ వంటి సంస్థలు రోజుకు వేల కోట్లు సంపాదిస్తున్నాయంటే, దానికి ఇంధనం మన మెదడులోని డోపమైన్, మన చేతిలోని సమయమే!
దిగ్భ్రాంతికర గణాంకాలు
2025–26 నివేదికల ప్రకారం ఇటీవలి గణాంకాలు చూస్తుంటే మనం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.
→ సగటు భారతీయుడు రోజుకు దాదాపు 6.5 గంటల సమయాన్ని ఇంటర్నెట్పై గడుపుతున్నాడు. ఇందులో మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేవలం వినోదం, సోషల్ మీడియాకే పరిమితం.
→ ఒకప్పుడు మనుషుల్లో పన్నెండు సెకన్లుగా ఉన్న అటెన్షన్ స్పాన్, ఇప్పుడు ఎనిమిది సెకన్లకు పడిపోయింది. ఒక గోల్డెన్ ఫిష్ అటెన్షన్ స్పాన్ తొమ్మిది సెకన్లు. అంటే మనం దానికంటే ఘోరంగా ఉన్నామన్నమాట!
→ రోజుకు ఐదుగంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న టీనేజర్లలో ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం 35 శాతం పెరిగినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక చెబుతోంది.
→ ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల 2025లో భారతీయ కుటుంబాలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయినట్లు అంచనా.
బయటపడటం ఇలా...
ఈ ‘అడిక్షన్ ఎకానమీ‘లో మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజే మీ డిజిటల్ ప్రయాణాన్ని నియంత్రించుకోండి. స్మార్ట్ఫోన్ కంటే మీ స్మార్ట్నెస్ గొప్పదని నిరూపించండి!
→ మీ ఫోన్ స్క్రీన్ను రంగులు లేకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో మార్చండి. రంగులు లేకపోతే మెదడుకు ఆ దృశ్యాలు ఆకర్షణీయంగా అనిపించవు, తద్వారా ఫోన్ వాడకం 30 శాతం తగ్గుతుంది.
→ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మెదడుకు చిన్న విరామాన్ని ఇస్తుంది.
→ డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఫోన్ను అనుమతించకండి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వల్ల ’మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి గాఢ నిద్ర పడుతుంది.
→ మీ ఫోన్లోని సెట్టింగ్స్లో ’డిజిటల్ వెల్–బీయింగ్’ ఆప్షన్ ద్వారా ప్రతి యాప్కు సమయాన్ని కేటాయించుకోండి. సమయం ముగియగానే యాప్ లాక్ అయ్యేలా చూసుకోండి.
→ ఖాళీ సమయం దొరకగానే ఫోన్ తీయకండి. ఆ ఖాళీ సమయాన్ని ఆలోచనల కోసం, ప్రకృతిని గమనించడం కోసం కేటాయించండి. సృజనాత్మకత ఎప్పుడూ ఖాళీ మెదడులోనే పుడుతుంది.
మెదడును హ్యాక్ చేస్తున్న సైకాలజీ
టెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వందల సంఖ్యలో సైకాలజిస్టులను నియమించుకుంటాయి. ఎందుకో తెలుసా? మన మెదడులోని బలహీనతలను కనిపెట్టడానికి. జూదం ఒక వ్యసనం. ఒక లాటరీలో ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో తెలియదు. సైకాలజిస్టుల సహాయంతో అలాంటి వ్యసనాన్ని సోషల్ మీడియాలో ‘నోటిఫికేషన్స్’ ద్వారా సృష్టించారు. అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపించే డోపమైన్ను రిలీజ్ చేసేలా లైక్స్, కామెంట్స్ పనిచేస్తాయి.
నెవెర్ మైండ్
స్మార్ట్ఫోన్ మోసుకొచ్చిన మాయ రోగాల్లో ‘డూమ్ స్క్రోలింగ్’ ఒకటి. ‘డూమ్ స్క్రోలింగ్’ బారినపడిన వారు అదేపనిగా స్మార్ట్ఫోన్లో కలత రేపే వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వార్తలను చూస్తూ ఆందోళనకు, దిగులుకు లోనవుతారు. అయినా, వారు ‘డూమ్ స్క్రోలింగ్’ను నియంత్రించుకోలేరు.

సైకాలజిస్ట్ విశేష్
ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్


