జయ హనుమంత! అమిత బలవంత! | Lord Hanuman birth celebrations Of Special Story | Sakshi
Sakshi News home page

జయ హనుమంత! అమిత బలవంత!

May 11 2026 6:05 AM | Updated on May 11 2026 6:05 AM

Lord Hanuman birth celebrations Of Special Story

(రేపు హనుమజ్జయంతి)

చాలా గొప్ప వైవిధ్యభరిత పాత్రలనే రత్నాలతో కూర్చబడిన హారం శ్రీ మద్రామాయణం. అన్నిటి మధ్యనా తళుకులీనే మేటి మణిపూస వంటి పాత్రగా హనుమంతుడు మనకు దర్శ నమిస్తాడు. మహా జ్ఞాన సంపన్నుడు, అద్భుత బలశాలి, వినయశీలి, మహా భక్తుడు, ధీరాగ్రేసరుడు, కార్యసాధకుడుగా మనకు గోచరమవుతాడు.

శివాంశతో, వాయుదేవుని అనుగ్ర హంతో కేసరి, అంజనాదేవి దంపతులకు జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుండే తన అద్భుత శక్తి సామర్థ్యాలను చూపించాడు. సముద్ర లంఘనం, రాక్షస సంహారం, సంజీవనిని తేవడం వంటి ఘనకార్యాలు మారుతివంటి బలశాలికి తప్ప ఇతరులకు సాధ్యమయే విషయాలు కావు. బాల్యంనుండే తన దేహబలాన్ని దుందుడుకు పనులకు ఉపయోగిస్తున్న బాలాంజనేయునికి ఆయన హితైషులు ఒక శాపం వంటి వరాన్ని ఇచ్చారు. అదేమంటే తన శక్తి తనకు తెలియక పోవడం. ఇతరులెవరైనా తెలిపితే తప్ప మారు తికి తన శక్తి సామర్థ్యాలు తనకు తెలియకూడదని శ్రేయోభిలాషుల ఆంతర్యం.

విద్యావినయసంపన్నుడు– కేసరీ నందనుడు
పట్టుదల, బుద్ధికుశలత, సూక్ష్మగ్రాహిత్వము, విద్యా పారీణతలకు ఆంజనేయుడు ప్రతీక. ఆయనను సేవిస్తే విద్యలలో కౌశల్యం, సూక్ష్మ బుద్ధి తప్పక లభిస్తాయని పరాశర సంహిత చెబుతుంది. అంతటి విద్య, ఘనమైన దేహబలమున్నా, మూర్తీభవించిన వినయస్వరూపుడు హనుమ. తన ప్రభువైన సుగ్రీవుని పట్ల, తనకు దైవమైన శ్రీరాముని పట్ల ఆయ న ప్రదర్శించిన వినయం అద్వితీయ మైనది. తాను వారికి సేవకునిగా, బంటుగా ఎప్పుడూ భావించేవాడు ఆయన. ఇది లోకులందరకూ స్ఫూర్తి దాయకం. అతని భక్తికి నిదర్శనమా అన్నట్లు మారుతి లేని రామాలయం ఎక్కడా కనపడదు.

కార్యదీక్షా తత్పరుడు 
ఒక కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేకుండా, ఆ కార్యం నెరవేర్చే దాకా విశ్రమించని లక్షణం హనుమది. సామాన్యులకు సరే సరి... అంగద, జాంబవంతాది వీరులకు కూడా దాటడానికి సాధ్యం కాని సముద్రాన్ని దాటి, లంక ను చేరి, సీతమ్మ జాడ కనుగొని, తమ శక్తిని శత్రువులకు తెలియజేసి, తిరిగి ఆ విషయాన్ని శ్రీరామునికి నివేదించే వరకూ హనుమ విశ్రమించలేదు. ఆతిథ్యాన్ని అందించ వచ్చిన మైనాకునితో మరియు సముద్రునితో ఆ విషయమే సవినయంగా తెలిపి ముందుకు సాగిన కార్య నిబద్ధుడు ఆంజనేయుడు.

ఎన్నో సుగుణాలు, ఆదర్శాలు మూర్తీభవించి ఉన్న హనుమను తమలపాకులు, వడల మాలలు, సింధూరాలతో పూజించిన భక్తులకు బుద్ధి, దేహబలం, కీర్తి, ధైర్యం, నిర్భయ త్వం, ఆరోగ్యం, పాపనివృత్తి, వాక్పాటవం కలుగుతాయని పెద్దల మాట. అంతేకాదు. ఆంజనేయుని పూజించే వారి కి భోగ, మోక్షాలు రెండూ సులభంగా లభిస్తాయని పరాశర సంహిత చెబు తున్నది. మన దేశంలోని దాదాపు ప్రతి చిన్న పల్లెలోనూ రామాలయాలు, ఆంజనే యుని ఆలయాలూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధగిరి, కొండగట్టు, గండి, కసాపురం, శింగరకొండ వంటి సుప్రసిద్ధ హనుమత్‌ క్షేత్రాలన్నింటిలోనూ హనుమజ్జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

– డాక్టర్‌ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి 

 

Advertisement
 
Advertisement
Advertisement