
యూరోపియన్ శైలిలో ప్యాలెస్ నిర్మాణం
నిజాం ప్రభువుల నివాస గృహంగా గుర్తింపు
అసఫ్ జాహీల రాచరిక పాలనకు నిలువుటద్దం
హైదరాబాద్ : అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్ ‘సాక్షి’గా నిలుస్తుంది. రెండో నిజాం కాలంలో చార్మినార్–లాడ్బజార్కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. యూరోపియన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా పాలరాతి వలే నిర్మితమైన ఈ ప్యాలెస్ చార్మినార్ కట్టడానికి దగ్గరలోని ఖిల్వత్లో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడముచ్చటగా ఉంటుంది. నగర సందర్శకులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ మ్యూజియం అందుబాటులో ఉంటుంది. దేశ, విదేశీ పర్యాటకులను అధికంగా ఆకట్టుకుంటున్న చౌమహల్లా ప్యాలెస్ సాధారణ రోజుల్లో కన్నా వారాంతాల్లో సందడిగా ఉంటుంది.
నిర్మాణ విశిష్టతలు..
ఇది నాలుగు ప్యాలెస్ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అఫ్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్లో నాలుగు ప్యాలెస్ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్లోని షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్ మహల్ నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది.
మ్యూజియం విశేషాలు..
నాటి ఫర్నీచర్, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు ఇతర విలువైన పురాతన వస్తువులన్నింటినీ నాలుగు ప్యాలెస్లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. వారంలో శుక్రవారం మినహా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శించవచ్చు. పెద్దలకు రూ.100, పదేళ్ల లోపు చిన్నారులకు రూ.40, విదేశీయులకు రూ.400, మోబైల్ ఫొటోగ్రఫీ రూ.50గా సందర్శనకు టికెట్ ధర నిర్ణయించారు.
నాటి చరిత్రకు వెలుగులు..
దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో ఇది నిర్మితమైంది. నాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్కు మరింత శోభను తీసుకొస్తున్నాయి. 1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేటు వద్ద అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్లో ఆతిథ్యమిచ్చేవారు.