అంబేడ్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): విజయవాడ స్వరాజ్ మై దానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మారక ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ అన్నారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం నిర్లక్ష్యానికి గురికావడం కలచివేస్తోందన్నారు. అలాగే రాత్రిళ్లు ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని తక్షణమే శుభ్రం చేయించి, లైట్లు, నీటి ఫౌంటెన్లు, విద్యుత్ సదుపాయాలను వెంటనే పునరుద్ధరించాలని, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నిషేధించాలని కోరారు. పాము మాన్సింగ్, చిలకా సుబ్బారావు, వెంపా నాగరాజు, తెనాలి సరేష్, కనికెళ్లి మురళీ కృష్ణ, ఆర్.సురేష్ పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు (శారీరక వైకల్యం) మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం దరఖాస్తులు కోరుతు న్నట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిసి దరఖాస్తులను తమ కార్యాలయంలో ఈనెల 25లోపు అందజేయాలని కోరారు.
దెందులూరు: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెజ్లింగ్ పోటీలకు రాష్ట్ర అబ్జర్వర్గా గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా నున్నలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తారు. మూడు రోజులు పాటు రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి.
ఏలూరు (టూటౌన్): కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగుబడిన సంపద, పెట్టుబడుదారీ విధానం పతనానికి దారి తీస్తుందని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ పరిణామాలు సోషలిజం అనివార్యం అనే అంశంపై స్థానిక సీతారామ భర్తీయా కల్యాణ మండపంలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానం పేదల పొట్ట కొట్టి కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బంధిస్తుందని, నేటి ప్రపంచ పరిణామాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయన్నారు. సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జీవీఎల్ నరసింహారావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: కోడి పందేల నిర్వహణ, ప్రైవేట్ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో పెద్దెత్తున ముడుపులు అందుకున్నారనే ఆరోపణలపై భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యపై గురువారం ప్రత్యేక పోలీసు బృందం విచారణ చేపట్టినట్లు తెలిసింది. డీఎస్పీ జయసూర్య తన పరిధిలో పేకాట, కోడి పందేల నిర్వాహకులను ప్రోత్సహించడమేగాక సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు జనసేన నాయకులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీఎస్పీపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయితే డీఎస్పీ జయసూర్యపై ప్రత్యేక విచారణ చేయాలంటూ విజయవాడ అడిషనల్ ఎస్పీని ఉన్నతాధికారులు ఆదేశించడంతో నలుగురు సభ్యుల బృందంతో విచారణ చేసినట్టు తెలిసింది.


