
ఉద్యోగం ఒకచోట.. పెత్తనం మరోచోట
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆయన జిల్లాస్థాయి అధికారి.. సర్వీసులో ఎక్కువ కాలం ఒక్క పోస్టింగ్తో పాటు మరో రెండు ఇన్చార్జులు తీసుకోవడం ఆయనకున్న అలవాటు.. అయితే పదవులన్నీ ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చుట్టూనే తిరుగుతుంటాయి.. అలా అని ఆయన ఆ బ్యాంకులో పనిచేసే అధికారి కాదు.. కాని ఏలూరు జిల్లా సహకార శాఖలో మాత్రం ఎప్పుడూ కీలక బాధ్యతల్లోనే ఉంటారు. మూడు రోజుల క్రితం డీసీసీబీ బ్యాంకులో జరిగిన మహాజన సభతో సంబంధం లేకపోయినా హాజరై ప్రసంగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సంబంధం లేకపోయినా..
ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ ఆడిట్ అధికారిగా ఉన్న ఆరిమిల్లి శ్రీనివాస్ను ఈనెల 9న బదిలీల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారిగా నియమించారు. ఇప్పటికే ఆయన విజయవాడలో హౌస్ఫెడ్లో సేల్స్ ఆఫీసర్ గా ఇన్చార్జి హోదాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. గతంలో జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా, ఆడిట్ ఆఫీసర్గా, డిప్యూటీ రిజిస్ట్రార్గా ఏళ్ల తరబడి పనిచేశారు. ఇటీవల భీమవరం బదిలీ అయ్యారు. గతేడాది అప్పటి జిల్లా సహకారశాఖ అధికారి పదవీ విరమణ అయితే ఏడాది కాలం ఇన్చార్జిగా శ్రీనివాసే పనిచేశారు. జిల్లా సహకార శాఖకు, డీసీసీబీకి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా జిల్లా సహకార శాఖ అధికారి హోదాలో బ్యాంకులోనూ ఆయన హవానే కొనసాగుతోంది.
అవినీతి ఆరోపణలు
ప్రస్తుతం భీమవరంలో పనిచేస్తున్నా మళ్లీ ఏలూరు జిల్లా అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈనెల 27న ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ గన్ని వీరాంజనేయులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొదటి మహాజన సభ నిర్వహించారు. వాస్తవానికి సమావేశానికి జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇతర కో–ఆపరేటివ్ సిబ్బందికి ఆహ్వానం కాని, హాజరుకావాల్సిన అవసరం కాని ఉండదు. గతంలో ప్రభుత్వ షేర్ బ్యాంకులో ఉన్న క్రమంలో ప్రతి మహాజన సభకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యేవారు. ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంతో బ్యాంకు వ్యవహారంలో సహకార శాఖ పాత్ర ఉండటం లేదు. అయినా భీమవరం డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి మాత్రం ప్రత్యేక శ్రద్ధతో బ్యాంకులో మహాసభకు హాజరుకావడంతో పాటు సమావేశాన్ని పూర్తిగా నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల క్రి తం కొందరు సదరు అధికారి తీరుపై ముఖ్యమంత్రి కే ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గతంలో సదరు అధికారి ఏలూరులో ఉన్నప్పుడు పలు సొసైటీల్లో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా వెళ్లి విచారణ పూర్తయినా నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదనే పేరు ఉంది. 258 సొసైటీలు జిల్లాలో ఉంటే సు మా రు 30 సొసైటీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించి, విచారణ నిర్వహించి మధ్యలోనే నిలిపివేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో సంబంధం లేకపోయినా బ్యాంకులో హడావుడి కొనసాగిస్తుండటం గమనార్హం.
డీసీసీబీలో షాడో చైర్మన్
డీసీసీబీలో సహకార అధికారి పెత్తనం
బ్యాంకులో సిబ్బంది వద్ద హడావుడి
ఇప్పటికే రెండు పోస్టుల్లో సదరు అధికారి
జిల్లా కో–ఆపరేటివ్ అధికారిగా మరో పోస్టు కోసం ప్రయత్నాలు
ఆడిట్ విచారణల వ్యవహారంలోనూ పెద్ద పాత్ర