
గళమెత్తిన పంచాయతీ కార్యదర్శులు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఏలూరు తరలివచ్చి ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ధర్నా చేసి కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సచివాలయ సిబ్బందికి మధ్య విధుల్లో సమన్వయం కుదరడం లేదని, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యాలకు తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు సచివాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఉన్నతాధికారులు తమను బాధ్యులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో సుమారు 200 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చింతలపూడి మండలంలో
మూకుమ్మడి సెలవు
చింతలపూడి: ఏలూరులో నిరసన, కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు కావాలంటూ ఎంపీడీఓ మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూకుమ్మడి సెలవు పెట్టామన్నారు. రోజూ ఉదయం 6 గంటలకే విధులకు హాజరై ఫొటో దిగి పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటూ మౌకికంగా ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.