
రాజీకి వెళితే తల పగలగొడతారా?
దెందులూరు: గతంలో జరిగిన గొడవ పరిష్కారం నిమిత్తం రాజీకి వెళితే తల్లిదండ్రుల ఎదుటే కొడుకు తలపగలగొట్టడం ఏం సంప్రదాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం టీడీపీ వర్గీయుల దాడిలో తలపగిలి తీవ్రంగా గాయపడిన ఈదా భార్గవ్ను, అతని కుటుంబ సభ్యులను రాయన్నపాలెంలోని వారి నివాసంలో అబ్బయ్య చౌదరి కలిసి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలను పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అబ్బయ్య చౌదరి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
గత ఆదివారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయం వద్ద జరిగిన శుభకార్యానికి యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ స్నేహితులు వెళ్లి తిరిగి వస్తుండగా రాయన్నపాలెం గ్రామం వద్ద కొంతమంది యువకులతో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో మహేష్ యాదవ్ తనపై, తన కారు డ్రైవర్పై రాయన్నపాలెం యువకులు వెంటబడి దాడి చేసి గాయపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహేష్ యాదవ్పై దాడి చేసిన వారి తల్లిదండ్రులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో మహేష్ యాదవ్ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ క్రమంలో శనివారం దెందులూరులోని మహేష్ యాదవ్కు చెందిన దాబా వద్దకు దాడి చేసిన యువకులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, బొద్దు సురేంద్ర, మహేష్ యాదవ్ అనుచరులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హోటల్ వద్దకు వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించారు. తరువాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వారిని చికిత్స నిమిత్తం తరలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా దెందులూరు ఎస్సైని ఆదేశించారు.
టీడీపీ వర్గీయుల తీరు మారదా?
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ధ్వజం

రాజీకి వెళితే తల పగలగొడతారా?