
మౌలిక వసతుల కోసం గిరిజనుల మొర
బుట్టాయగూడెం/ఏలూరు (మెట్రో): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది శనివారం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ముంజులూరు, పులిరామన్నగూడెం, చింతపల్లి తదితర గ్రామాల్లో జనభాగీదరీ అభియాన్, పీఎం జన్మాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గిరిజనులు తమ సమస్యలను ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇళ్ల నిర్మాణం వేగిరపర్చాలని, వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు మెడికల్ సబ్సెంటర్ భవనానికి మరమ్మత్తులు చేయించాలని పులిరామన్నగూడెం గిరిజనులు కోరారు. తమకు అదనపు ఓహెచ్ఎస్ఆర్ కావాలని, అంతర్గత రోడ్లు నిర్మించాలని చింతపల్లి గిరిజనులు అభ్యర్థించారు. అలాగే పులిరామన్నగూడెం నుంచి చింతగూడెం రోడ్డు నిర్మించాలని కోరారు. బుట్టాయగూడెం కొల్లుమామిడి గ్రామంలో మల్టీపర్పస్ సెంటర్, అంగన్వాడీ సెంటర్ను ఆయన సందర్శించారు. అనంతరం కేఆర్పురం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 30 వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఎంపీడీఓ కె.జ్యోతి, తహసీల్దార్ పీవీ చలపతిరావు ఉన్నారు. సాయంత్రం ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తన పర్యటన, గిరిజన గ్రామాల్లో సమస్యలను కలెక్టర్కు తెలియజేశారు.