
జగన్నాథ ఉత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథని ఆలయం రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పూరీలో వలె ఈ ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జగన్నాథ రధయాత్ర ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రం వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే ఈ సారి స్వామివారి దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేవస్థానం అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇత్తడితో దశావతారాల రూపాలను తయారు చేయించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని జగన్నాథుడు శుక్రవారం ఆలయ యాగశాలలో మత్స్యావతార అలంకారంలో దర్శనమిస్తారని, భక్తులు దర్శించి తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు.