చేదు మిగిల్చిన మామిడి | - | Sakshi
Sakshi News home page

చేదు మిగిల్చిన మామిడి

Jun 27 2025 4:20 AM | Updated on Jun 27 2025 4:20 AM

చేదు

చేదు మిగిల్చిన మామిడి

నూజివీడు : ఏ ఏటికాయేడు లాభాలను పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు మామిడి చేదునే రుచిచూపిస్తోంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటం, ధర లేకపోవడంతో రైతులు కు ఆదాయం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నప్పటికీ అదే మామిడిని సాగుచేస్తున్న రైతులు మాత్రం తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితి బాగుంటుందనే ఆశాభావంతో మామిడి రైతు ముందుకు సాగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోగా ఏడాదికేడాదికి మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధర లభిస్తుందని రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీనిలో నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మామిడి పంట లక్షణం ఒక ఏడాది కాపు బాగా ఉంటే మరో ఏడాది దిగుబడి ఉండదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా మామిడి దిగుబడి ఉంటోంది. గత నాలుగైదేళ్లుగా ప్రతిఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో ఎక్కడ చూసినా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ పిందెగా మారే శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. పూత దశలో ఆశిస్తున్న నల్లతామర రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది.

పతనమైన ధరలు

రైతులు ఎక్కుగా బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్‌), రసాల తోటలను సాగుచేస్తుండగా ఈ ఏడాది అన్ని రకాల దిగుబడి చాలా తక్కువగా ఉంది. కాపు పది నుంచి 20శాతం లోపు మాత్రమే ఉండటంతో మామిడికి సీజన్‌ ప్రారంభంలో మంచి ధర లభించింది. బంగినపల్లి రకం కాయలకు టన్నుకు ముంబాయి మార్కెట్‌లో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర లభించింది. అయితే రానురాను కొంతమేరకు ధర తగ్గుముఖం పట్టినప్పటికీ టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధర నిలబడింది. నూజివీడు, నున్న, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లోని కమీషన్‌ షాపుల్లో టన్ను రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు మాత్రమే ఉంది. తోతాపురి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి ప్రారంభంలో టన్ను 12 వేల ధర లభించినప్పటికీ రానురాను పతనమవుతూ టన్ను రూ.3 వేలకు పడిపోయింది. అంతేగాకుండా మే నెల అంతా వర్షాలు కురవడం వల్ల కాయల్లో నాణ్యత సైతం తగ్గిపోయింది. దీంతో రైతులకు కోతఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నష్టాలు మిగలడంతో ఖరీఫ్‌ సీజన్‌లో మామిడి తోటల్లో దుక్కిదున్ని ఎరువులు వేసే పరిస్థితి లేదు.

పట్టించుకోని ప్రభుత్వం

మామిడి ధరలు పతనమైనా రైతులను ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కనీసం ధరలు పతనమవ్వకుండా చర్యలు తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్‌లో మామిడి కాయలను కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసే సేట్‌లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పే అధికారి కూడా ఎవరూ లేకపోవడంతో మామిడి ధర పతనమై రైతులకు ఈ ఏడాది చేదును పంచింది.

రూ.15 లక్షల నష్టం వాటిల్లింది

ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు రాకపోవడంతో కాయలను కోయకుండా వదిలేశా. బంగినపల్లి ధర సైతం టన్ను రూ.10 వేలకు పడిపోయింది. 40 ఎకరాల్లో మామిడి కాపును కొంటే ధర లేక రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ఆదుకోవాలి.

– బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం

ధర లేక నిరాశలో రైతులు

కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి

ఏటా నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన

చేదు మిగిల్చిన మామిడి 1
1/1

చేదు మిగిల్చిన మామిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement