
వాగునే మింగేశారు
నూజివీడు : అధికారం ఉందనే అహంకారం.. మా జోలికి ఎవరొస్తారనే ధీమాతో ఏకంగా వాగునే ఆక్రమించేశారు. దాదాపు 40 అడుగుల వెడల్పు ఉన్న వాగును 50 మీటర్ల పొడవునా పెద్ద ఎత్తున మట్టిపోసి వాగు ఏ మాత్రం కనబడకుండా చెరబట్టారు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకులు. నూజివీడు గుండా వెళ్తున్న 216హెచ్ హైవే రోడ్డును ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నుబడిన అధికార పార్టీ నాయకులు ఇరువురు పావులు కదిపారు. చెరువులో మట్టి తోలకాలకు అనుమతులు పొంది ఆ మట్టితో వాగును పూడ్చేసి ఆక్రమించేశారు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరద నీరు వెళ్లడానికి దారి లేక పొలాలన్నీ ముంపునకు గురవుతాయని వాగుకు చుట్టుపక్కల ఉన్న రైతులు ఆందోళన చెంది అభ్యంతరం వ్యక్తం చేసినా వారినెవరిని లెక్కచేయకుండా తమ పనిని కానిచ్చేశారు.
కళ్లు మూసుకున్న అధికారులు
పట్టణంలోని పెద్ద చెరువు ఆయకట్టు మధ్యలో నుంచి వెళ్తున్న వాగుకు అడ్డుగా మెరకతోలి యథేచ్ఛగా పూడ్చేసి ఆక్రమించేసినా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కళ్లు మూసుకొని కూర్చోవడం గమనార్హం. పట్టణంలో రెండు వార్డులకు ఒక వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్లు ఉన్నప్పటికీ వారెవరికి ఆక్రమణలు పట్టవు. ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ఇరిగేషన్ అధికారులకు ఏమాత్రం కనబడదు. గాంధీనగర్, స్టేషన్తోట, సబ్కలెక్టర్ కార్యాలయం, భువనగిరిపేట, 30, 31, 32 వార్డుల్లో వర్షం కురిసినప్పుడు వచ్చే వరద నీరంతా ఈ వాగులోకి చేరి పొలాల మధ్య గుండా ప్రవహించి ఊటవాగులోకి చేరుతుంది. 216హెచ్ హైవేను ఆనుకునే ఉన్న ఈ ఆక్రమించిన వాగు విలువ కోట్లలోనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ హైవేను నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి కానుండటంతో ఆక్రమణకు గరైన వాగు స్థలం విలువ ఇప్పటి కంటే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంత విలువైన స్థలాలు అన్యాక్రాంతం కావడంతో పాటు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులను ఆక్రమించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు చుట్టుపక్కల ప్రదేశాలకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమించిన వాగులోని మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు.
ఆక్రమణలో అధికార పార్టీ నేతల పర్వం
మాజోలికి ఎవరొస్తారనే ధీమాతో దురాక్రమణలు
వరద వస్తే పొలాలు మునిగిపోతాయని రైతుల ఆందోళన