
పింఛన్ల కోసం పడిగాపులు
ఆకివీడు: పింఛన్లు మే 31వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పలు చోట్ల ప్రజలు శనివారం ఉదయం నుంచే వీధుల్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. స్థానిక వడలి వారి వీధి, సంతపేట ప్రాంతాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు మధ్యాహ్నం వరకూ వేచి చూసినా పంపిణీ చేసే ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. తిండితిప్పలు లేకుండా, ఉక్కబోత వాతావరణంలో చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డామని వృద్ధులు, దివ్యాంగులు వాపోయారు. ఈ విషయాన్ని సాక్షి ద్వారా కమిషనర్కు తెలియజేయగా సంబంధిత ఉద్యోగి సెలవులో ఉన్నారని, అందువల్ల సంతపేట, ఆనాల చెరువు ప్రాంతాల్లోని పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయలేదని చెప్పారు. కనీసం ఈ విషయాన్ని బాధితులకు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేయండని చెప్పినా వారికి సమాచారం ఇవ్వలేదు. కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో తమకు పట్టాలిచ్చారని, అక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఫించన్, రేషన్కు ఆకివీడు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.
ముగిసిన జిల్లా స్థాయి
ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు పట్టణంలోని ప్రతిభ స్కూల్ నందు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ, శ్రీ హంస చెస్ అకాడమీ, ఏలూరు జిల్లా అడ్హక్ కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో చొప్పా వీర వెంకట వివేక్ మొదటి స్థానాన్ని, కన్నా సోనాలి శ్రీమణి కార్తిక రెండవ స్థానాన్ని, తురసం శశి ప్రియాంక మూడవ స్థానాన్ని, సుందరిపల్లి నితిన్ శ్రీసాయి నాల్గవ స్థానాన్ని, పెన్మత్స సాత్విక్ వర్మ 5వ స్థానాన్ని సాధించారని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పి.కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ సరోజ రెడ్డి, అయినపర్తి సరళామాధవి, అయినపర్తి చంద్రశేఖర్ మాస్టారు, కన్నా సూర్య నాగేశ్వరరావు, సురేఖ పాల్గొన్నారు.

పింఛన్ల కోసం పడిగాపులు