
చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారు
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తూ సర్పంచ్ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్ఆర్పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్, కనికెళ్ళ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నందు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.
2న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్: జూన్ 2న ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏసీఓ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ ఆశోక్కుమార్, ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. జట్టుకు ఎంపికై న వారు 2025–2026 సంవత్సరంలో ఏసీఓ నిర్వహించే సెంట్రల్ జోన్ ఇంటర్ డ్రిస్టిక్ట్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. వివరాలకు 70136 33143 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. కాగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన ఎంపిక పోటీల తర్వాత అండర్–23, సీనియర్ క్రికెట్ జట్లును కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ జట్లు త్వరలో మూలపాడులో నిర్వహించే అంతర జిల్లాల పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు.