
చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్మోహన్ కుమారుడు నవదీప్పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు.
పోక్సో కేసులో లాడ్జి యజమాని అరెస్ట్
భీమవరం: మైనర్ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి కాళీచరణ్ చెప్పారు. ఈనెల 12వ తేదీన వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్ చేయగా వారికి రూమ్స్ అద్దెకిచ్చిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్ విధించడంతో నరసాపురం సబ్జైలుకు తరలించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు.