ఏలూరు(మెట్రో): సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ షేక్ హాబీబ్ బాషా అన్నారు. ఏలూరు వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సేంద్రీయ దుకాణాలు, ఎన్పీఎం ఉత్పత్తులపై రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రీయ, ప్రకృతి విధానంలో ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పరిధిని విస్తరించే మార్గాలను పరిశీలించాలన్నారు. ఉత్పత్తులు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉండేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్కు 48 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు బుధవారం 5 కేంద్రాల్లో నిర్వహించారు. ఉదయం 61 మందికి 24 మంది హాజరు కాగా 37 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 34 మందికి 24 మంది హాజరయ్యారు. దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షల్లో బుధవారం భౌతిక, రసాయనశాస్త్రాల పరీక్షలకు మొత్తం 55 మందికి 43 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
బాల సదనంలో సౌకర్యాల పరిశీలన
దెందులూరు: దెందులూరు ప్రభుత్వ బాలసదనాన్ని బుధవారం న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.రత్న ప్రసాద్ సందర్శించారు. బాలికల విద్య, వసతి, ఆహారం, విద్యుత్, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా ఉచిత న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వడానికి న్యాయ సేవ అధికార సంస్థ సేవలందిస్తుందన్నారు.
ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2025–26 ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్యాంపస్లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉన్న ఆడిటోరియంలో ఏర్పాట్లు చేశారు. తొలిరోజు సైనికోద్యోగుల పిల్లల కోటాలో 119 మంది అభ్యర్థులు, క్రీడా కోటాలో 227 మంది హాజరయ్యారు.
కూటమి నేతల ప్రాపకం కోసం పాట్లు
ద్వారకాతిరుమల: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ప్రభుత్వ అధికారులకు కలిసొచ్చాయి. కొందరు అధికారులు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు ఎన్టీఆర్ జయంతి వేడుకలను తన కార్యా లయంలో ఘనంగా నిర్వహించారు. వీఆర్వోలు, రేషన్ డీలర్లు పాల్గొనేలా చూశారు. ఇదిలా ఉంటే తహసీల్దార్ సుబ్బారావు పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కూటమి నేతలు ప్రస్తుత బదిలీల్లో ఆయనను ఇక్కడి నుంచి సాగనంపాలని భావిస్తున్నారట. ఈ తరుణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు తహసీల్దార్కు కలిసొచ్చాయని కొందరు అంటున్నారు.
ఆక్వాకు పంట విరామం
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన ఆక్వా రైతు, సొసైటీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు బుధవారం ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రొయ్య దిగుబడి బాగుంటున్నా ధర పతనం కావడం, మేతలు, మందుల ధరలు పెరిగిపోవడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం పెంచాలి