
వైఎస్సార్సీపీ పటిష్టానికి కృషి చేద్దాం
నూజివీడు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. నూజివీడు మండలానికి చెందిన నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధికారాన్ని కోల్పోయాక కొందరు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని, దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నారు. పాతనీరు పోతే కొత్తనీరు వస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబు పాలన బాగుందని ఒక్కరూ కూడా చెప్పడం లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీలు మారిన వారందరికీ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన నేపథ్యంలో జూన్ 4న ఏలూరులో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో ఒక్క పని జరగ లేదని, ప్రతిపనికీ డబ్బులేనని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. చెరువుల్లో మట్టిని, గ్రావెల్ను తోలుకొని సహజ సంపదలను దోచుకోవడంపై ఉన్న ఆసక్తి అభివృద్ధిపై లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ బాణావతు రాజు, నాయకులు వెలివల నాగేశ్వరరావు, వడ్డాది త్రినాథరావు, కోపూరి సుధాకర్, మందాడ శంకరరావు, పాలడుగు నాని, అక్కినేని ప్రేమసాయి(పసి), నక్కనబోయిన వెంకటేశ్వరరావు, చల్లారి రాఘవ, మేరుగ లెనిన్, బాణావతు కిషోర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు