
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి
ఏలూరు (టూటౌన్): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఉద్యోగాల నుంచి తొలగించిన 2,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే విధులలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి కి కార్మిక సంఘ నాయకులు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా కలెక్టరు కార్యాలయం వద్ద ఐఎఫ్టీయు, ఏఐటీయుసీ, సీఐటీయు నాయకులు, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సీఐటీయు అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ఐఎఫ్టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ 2500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తే టీడీపీ, జనసేన పార్టీలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.