
ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం
తాడేపల్లిగూడెం రూరల్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత 15 రోజులుగా తాడేపల్లిగూడెం మండలంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ వరి నారుమడి పనులకు ఆటంకంగా మారింది. ఇప్పటికే ఎల్.అగ్రహారం, పుల్లాయగూడెం, నీలాద్రిపురం, కృష్ణాపురం, మోదుగ గుంట, గొల్లగూడెం, అప్పారావుపేట తదితర గ్రామాల్లో దుక్కి దున్ని ఆకుమడి కోసం సంపద స్వర్ణ, పీఆర్.126 రకాల విత్తనాలను వేశారు. వర్షాలు విస్తారంగా కురవడంతో వేసిన విత్తనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఎండాకాలంలో వర్షాలు
మే నెలలో మెండుగా ఎండలు కాయాల్సింది పోయి వర్షాలు కురవడంతో ఖరీఫ్ ఆకుమడి పనులకు ఆటంకంగా మారాయి. ఏటా ఖరీఫ్ పనులను మే నెలలో ప్రారంభించి, జూన్ నెలాఖరు నాటికి మెట్ట రైతులు పూర్తి చేస్తారు. తద్వారా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే భారీ వర్షాల నుంచి పంట గట్టెక్కే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు కొట్టుకుపోవడంతో వర్షాలు తగ్గిన తర్వాత మరలా విత్తనాలు వేసుకోవలసిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాల బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో అయోమయంలో రైతులు
ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు వర్షార్పణం
అకాల వర్షాలతో నష్టం
మే నెలలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఖరీఫ్ ప్రారంభంలోనే నష్టాలు తప్పడం లేదు. ఈ వర్షాలకు పోసిన నారు నీటి పాలవుతుంది. దీనివల్ల మరలా విత్తనాలు చల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికై నా వర్షాలు తగ్గుముఖం పడితే విత్తనాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మరలా పెట్టుబడులు తప్పవు.
– మైలవరపు చంద్రరావు, రైతు, పుల్లాయగూడెం, తాడేపల్లిగూడెం మండలం
మరింత ఆలస్యం
ఏడెకరాల విస్తీర్ణానికి విత్తనాలు చల్లి ఇప్పటికే 15 రోజులు కావస్తుంది. మరో ఆరు రోజుల్లో నాట్లు వేయవలసి ఉంది. అయితే, వర్షాల కారణంగా కొంత విత్తనం కొట్టుకుపోగా, మరికొంత నారుమడి తయారై పోగులుగా తయారైంది. దీనివల్ల నారుమడి సరిపోతుందో లేదో అర్థం కాని పరిస్థితి.
– మతుకుమిల్లి రామారావు, రైతు, కృష్ణాపురం, తాడేపల్లిగూడెం మండలం

ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం

ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం