
మద్దిలో తెప్పోత్సవం
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో నిర్వహిస్తున్న హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఆదివారం అంజన్నకు ప్రభాత సేవ, నిత్య అర్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్ది ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, ధ్వజావరోహణ, చక్రస్నానం నిర్వహించారు. పెద్దెత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో ఆర్వీ చందన పర్యవేక్షించారు.
వనదేవతకు జన హారతి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆదివారం రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఉదయం తీవ్రమైన ఎండ ఉన్నా మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మి కొద్దిసేపు వర్షం కురిసింది. భక్తులు వర్షంలోనే అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద భక్తుల రద్దీ
కై కలూరు: వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం ద్వారా రూ.63,261 ఆదాయం వచ్చిందని చెప్పారు.
బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు
తాడేపల్లిగూడెం రూరల్: మాధవరంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెల్టు షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఇ.స్వరాజ్యలక్ష్మి వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

మద్దిలో తెప్పోత్సవం

మద్దిలో తెప్పోత్సవం