
నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్
ఏలూరు టౌన్: జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేదిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, మద్యం, నగదు అక్రమ రవాణాను నియంత్రించేలా నిత్యం వాహన తనిఖీలు చేయాలని ఆదేశించారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, శక్తి పోలీస్ టీమ్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తును వేగవంతం చేస్తూ కేసులను పరిష్కరించాలని సూచించారు.
కార్యాలయం తనిఖీ
తొలుత ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్కు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయంలోని రిసెప్షన్ కౌంటర్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. ఏఆర్, డాగ్ స్క్వాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్స్ కెమెరాల నిఘా విభాగం, హోమ్ గార్డ్స్ విభాగాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లోనూ తనిఖీలు చేసి ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో కేసుల ఛేదనపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు.