
పారిజాతగిరిలో వైభవంగా శ్రీచక్రస్నానం
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం విశేష పూజలు, నిత్య హోమాలు జరిపారు. ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సుదర్శన్ పెరుమాళ్లను తోడుకొని వెళ్లి యజ్ఞ బ్రహ్మ పానంగిపల్లి సత్య పవన్, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో వసంతోత్సవం, చూర్ణోత్సవం, నిర్వహించి అనంతరం యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. తరువాత భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ సుదర్శన్ పెరుమాళ్లను కోనేరు వద్దకు తీసుకువెళ్లి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు సైతం సుదర్శన్ పెరుమాళ్తో సహా స్నానమాచరించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి గజ వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణం గావించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, రెడ్డి రంగ ప్రసాద్, దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, బూరుగుపల్లి రవీంద్ర, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాల ఏర్పాట్లను కార్య నిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు.