
పంట నష్టపరిహారం చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): అకాల వర్షాలకు పంట లు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయిందని, మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే పంట నష్టాలను నమోదు చేయాలని కోరారు. చింతల పూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలన్నారు. టార్గెట్లతో సంబంధం లేకుండా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిబత్తుల సీతారామయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.
‘పోలవరం’ పనుల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న పక్కా గృహాలను నాణ్యత ప్రమాణాల మేరకు పూర్తి చేయాలని ఎంపీ పుట్టా మహేష్కుమార్ ఆదేశించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి సోమవారం ఆయన ఎంపీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్ఎన్డీపేట సమీపంలోని కోండ్రుకోట పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
ప్రతి పంటా కొంటాం : రైతులు పండించిన ప్రతి పంటా కొనుగోలు చేస్తామని ఎంపీ పుట్టా అన్నారు. మండలంలో రైతులు రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల లో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అకాల వర్షాల వల్ల రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయాయని రైతులు వాపోయారు.
జిల్లాస్థాయి అధికారులతో విచారణకు వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక తూర్పువీధి ఉర్దూ యూపీ స్కూల్, మౌలానా అబుల్ క లాం ఆజాద్ హైస్కూల్లో ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే చూపారని, వాటిని పరిశీలించి సరిచేయాలని చేసిన ప్రాతినిధ్యం మేరకు విచారణ అధికారులుగా హెచ్ఎం, ఎంఈఓను నియమించడం సముచితం కాదని ఏపీటీఎఫ్ 1938 నాయకులు అన్నారు. సోమ వారం డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజ నిర్ధారణకు జిల్లాస్థాయి అధికారులను నియమించాలని కో రారు. అప్పటివరకూ తాము విచారణను బహిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్, ఉపాధ్యక్షుడు ఈ.రామ్మోహన్ తదితరులు ఉన్నారు.
ఆరోగ్య రక్ష వాహనం ప్రారంభం
ఏలూరు(మెట్రో): బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష వాహనాన్ని సోమవారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయ అధికారి పాల్ సతీష్కుమార్, జిల్లా వైద్యశాఖాధికారి ఆర్.మాలినిలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల సురక్షా రక్షలో భాగంగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
పోడూరులో అధిక వర్షపాతం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం పోడూరులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పాలకోడేరులో 9.6 మి.మీ వర్షం కురిసింది. సోమవారం జిల్లా సమాచార శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లులో 73.4, తాడేపల్లి గూడెంలో 33.6, పెంటపాడులో 35, తణుకులో 16.6, అత్తిలిలో 31.6 మి.మీ వర్షం కురిసింది.

పంట నష్టపరిహారం చెల్లించాలి