
బాలికకు ఆర్థిక సాయం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెంకు చెందిన కంచర్ల జ్యోత్స్నకు వైద్య చికిత్స నిమిత్తం రూ.30 వేలు ఉడుత స్వచ్ఛంద సంస్థ అందజేసిందని పాప తండ్రి కంచర్ల రాజేష్ ఆదివారం తెలిపారు. సాక్షిలో ఏప్రిల్ 29న ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు శీర్షికకు స్పందించిన హైదరాబాద్కు చెందిన ఉడుత స్వచ్ఛంద సంస్థ సహకారం అందించిందన్నారు. సుమారు పన్నెండు లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సకు ఖర్చు అవుతుందని వైద్యులు అనడంతో దాతలపై ఆధారపడి ఉన్నామని రాజేష్ తెలిపారు.
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. అదివారం స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు నెలలు కావస్తున్న పనిచేసిన కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు.
11 కాసుల బంగారం చోరీ
ఉండి: గ్రామంలోని శేషాద్రి మధుసూధనరావు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున దోపిడీకి పాల్పడ్డారు. చోరీలో 11 కాసుల బంగారం, రూ.35 వేల నగదు దోచుకుపోయారు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలరించిన సంగీత నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): కళాదీపిక నృత్య అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో జరుగుతున్న సంగీత నృత్యోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండో రోజున ఆదివారం సాయంత్రం త్యాగరాజ స్వామి దివ్య నామ సంకీర్తన సంగీత కార్యక్రమం వీనులవిందు చేసింది. కళా దీపిక నృత్య అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య విన్యాసాలు నేత్రపర్వంగా నిలిచాయి. అతిథులుగా కళారత్న కేవీ సత్యనారాయణ, ఈడా మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, గరికపాటి కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. వయోలిన్ విద్వాంసురాలు ఏ.జయలక్ష్మి రామచంద్రన్, సంగీత విదుషిమణి గుడిపాటి లలితా శర్మ, సంగీత కళానిధి పరిమి సావిత్రి, నాట్యాచార్యలు డీ. హేమసుందర్, గండికోట రాజేష్, రాజ్కుమార్లను అకాడమీ తరఫున సత్కరించారు.
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.48,000, లడ్డూ ప్రసాదంపై రూ 23,250 ఆదాయం లభించిందని ఈవో చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బాలికకు ఆర్థిక సాయం

బాలికకు ఆర్థిక సాయం