
రీ సర్వే పనులు ఆపాలి
బుట్టాయగూడెం: రీ సర్వే పనులను నిలిపివేయాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ పీఓ రాములు నాయక్కు ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, నాయకులు సవలం రాంబాబులు మాట్లాడుతూ పోలవరం మండలం నాగంపాలెం రెవెన్యూ పరిధిలో జరగనున్న రీసర్వే వల్ల గిరిజనులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. 1994లో నాగంపాలెం సమీపంలో రెవెన్యూ, ఎల్ఎన్డీ పేట రెవెన్యూ గిరిజన సంఘ నాయకత్వంలో భూములను గత 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారని అన్నారు. వీటికి 1/70, పీసా చట్టం అనుసరించి సాగు పట్టాలు అందించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు పలుమార్లు వినతిపత్రం అందజేశామని చెప్పారు. ఇప్పుడు రీ సర్వే వల్ల ఆ భూముల్లో సాగు చేసుకునే గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 5 ప్రభుత్వ, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల కన్వీనర్, ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పీ. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 804, 14 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో 1672 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్కు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు నేరుగా ఐటీఐ వెబ్సైట్లో స్టూడెంట్ ఏరియాలోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తులను మే నెల 24వ తేదీ సాయంత్రం 5గంటల లోపు సమర్పించాలని సూచించారు. అనంతరం ఆ దరఖాస్తు కాపీ ప్రింట్ను తన ఒరిజినల్స్తో విద్యార్థి ఏదైనా ప్రభుత్వ ఐటీఐలలో మే 26వ తేదీ సాయంత్రం 5గంటల లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వివరాలకు 08812–230269 నెంబరులో సంప్రదించవచ్చన్నారు.
సీహెచ్ఓల ఆందోళనకు మద్దతు
ఏలూరు (టూటౌన్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సీహెచ్ఓలకు బుధవారం ఎన్జీవో నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్వి రామారావులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. న్యాయ మైన కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పలువురు సీహెచ్ఓల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలన్నారు. ఈపీఎఫ్ఓను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలన్నారు.
పింఛన్ల పంపిణీపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో మే నెలలో 2,59,685 మంది పింఛన్దారులకు రూ.112.98 కోట్ల పంపిణీని సమర్ధవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పింఛన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం మే 1న ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలన్నారు. మే 1న 100 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని దానికి అనుగునంగా అధికారులు అందరూ పనిచేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి పింఛన్లు ఇస్తున్న విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.విజయరాజు, జిల్లా పరిషత్ సీఈవో కె.భీమేశ్వరరావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి.నీలాద్రి, పంచాయతీ అధికారి కె.అనురాధ తదితరులు ఉన్నారు. మే 2న ప్రధాన మంత్రి పాల్గొనే రాజధాని పునఃనిర్మాణ కార్యక్రమ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వెళ్లేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రీ సర్వే పనులు ఆపాలి