
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
నూజివీడు: నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడో జోన్లోని 2.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేయాలని ఎన్నెస్పీ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నూజివీడులోని ఎన్నెస్పీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ప్రాజెక్ట్ కమిటీ సమావేశాన్ని చైర్మన్ కోట వీరబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.ఆర్. మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కమిటీ గత తీర్మానం ప్రకారం కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే ఎడమ కాలువ పరిధిలో 2వ, 3వ జోన్లలో ఉన్న కాలువల నిర్వహణకు ఎస్టిమేట్లు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ ఎడమ కాలువ పరిధిలో వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన 3.75 టీఎంసీల నీటిని తెలంగాణ ఎన్నెస్పీ అధికారులతో విడుదల చేయించాలన్నారు. అలాగే వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైస్ చైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ 3వ జోన్ పరిధిలో ఎడమ కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నుంచి ప్రతిపాదించిన రూ.199 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన 15 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నూజివీడు డివిజన్ ఈఈ ఆర్ సంతోష్, జగ్గయ్యపేట డివిజన్ ఈఈ కే.కిషోర్ డీఈలు కే సీతారావమ్మ, వీఎస్ఆర్ ప్రభు, కే రామదాసు, శశికుమారి, రాంబాబు, విజయలక్ష్మి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
కాలువల ఆధునికీకరణకు 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలి
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశం తీర్మానం