
అవయవ దానం.. బాధితులకు జీవితం
కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ద్వారపూడికి చెందిన నున్న శివన్నారాయణ (శివ) అవయవాలను ముగ్గురికి విజయవంతంగా అమర్చినట్టు ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ తెలిపారు. ట్రస్ట్ ఆస్పత్రిలో రోగికి శస్త్ర చికిత్స ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా చేపట్టామని, హైదరాబాద్కు చెందిన వైద్య నిపుణుడు సర్జన్ సచిన్ డాగా పాల్గొన్నారన్నారు. ట్రస్ట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ మూర్తి నేతృత్వంలో వైద్యులు సోమయాజులు, కిశోర్, గణేష్, సురేంద్ర, శ్రీకాంత్, రామకృష్ణ సమష్టిగా అవయవ సేకరణ, అమరిక నిర్వహించారన్నారు. రెండు కిడ్నీలలో ఒకటి విశాఖలో కిమ్స్ ఆస్పత్రిలోనూ, మరో కిడ్నీని ట్రస్ట్ ఆస్పత్రిలో రోగులకు అమర్చా మన్నారు. రెండు కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు అందించామన్నారు. శివ సోదరుడు వీరబాబు, వదిన శిరీష, భార్య విజయలక్ష్మి అవయవ దానం కోసం ముందుకు రావడంతోనే ఇది సాధ్యమైందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ నెల 25 రాజమహేంద్రవరం – ద్వారపూడి రోడ్డులో శివన్నారాయణ ప్రమాదానికి గురయ్యాడు.
మృతదేహానికి నివాళి
కపిలేశ్వరపురం (మండపేట): అవయవాల మార్పిడి ప్రక్రియ అనంతరం శివన్నారాయణ మృతదేహాన్ని ద్వారపూడికి బుధవారం తరలించా రు. నియోజకవర్గంలోని పలువురు ద్వారపూడికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ, పలు పార్టీల నాయకులు కంకటాల మురళీకృష్ణ, పాలిక రమణ, గజ్జి వెంకట రమణ, చింతా శ్రీనివాసరావు, పల్లా సన్యాసిరావు, తెల్లాకుల శివప్రసాద్, డాక్టర్ నాయుడు తదితరులు ఉన్నారు.

అవయవ దానం.. బాధితులకు జీవితం