ఆషాఢం.. అదుర్స్‌! | - | Sakshi
Sakshi News home page

ఆషాఢం.. అదుర్స్‌!

Jun 25 2025 6:48 AM | Updated on Jun 25 2025 6:48 AM

ఆషాఢం.. అదుర్స్‌!

ఆషాఢం.. అదుర్స్‌!

అన్నవరం: సాధారణంగా ఆషాఢ మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆదివారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఇదే సమయంలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి డిమాండ్‌ అమాంతం పెరిగిపోతుంది. తుని సమీపంలోని లోవ దేవస్థానంలో కొలువు తీరిన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తూంటారు. ఉమ్మడి జిల్లాలోని కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి లోవకు వెళ్లే భక్తులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగు ప్రయాణమవుతూంటారు. వీరు మార్గం మధ్యలో అన్నవరంలో ఆగి, సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూంటారు. దీంతో, ఈ ప్రసాదం విక్రయాలు ఈ మాసంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతూంటాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా సత్యదేవుని ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు ఇలా..

ఫ ఆషాఢ మాసంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు లోవ దేవస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారిలో అధిక శాతం మంది తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని కొత్త, పాత నమూనా ఆలయాల వద్ద, తొలి పావంచా వద్ద ప్రసాద విక్రయ స్టాల్స్‌లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఫ సాధారణ రోజుల్లో 60 వేలు, ఆదివారం నాడు పాత, కొత్త నమూనా ఆలయాల కౌంటర్లలో చెరో 20 వేలు, తొలి పావంచా కౌంటర్‌ వద్ద 30 వేలు, రత్నగిరిపై ఉన్న కౌంటర్ల వద్ద 30 వేలు, కలిపి మొత్తం లక్ష ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ల వద్ద అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు.

రూ.1.50 కోట్ల ఆదాయం!

మొత్తం మీద ఆషాఢ మాసంలో కొండ దిగువన ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా అన్నవరం దేవస్థానానికి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష ప్రసాదాల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయి. ఒక్కో ప్రసాదం ప్యాకెట్‌ ఖరీదు రూ.20. దీని ప్రకారం ఆషాఢ మాసం నాలుగు ఆదివారాల్లోనే సుమారు రూ.80 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రసాద విక్రయాల ద్వారా మరో రూ.70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

రెండు పూటలా తయారీ

రత్నగిరిపై ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రసాదం తయారు చేసి భక్తులకు వేడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఒక్క కార్తికం మినహాయిస్తే మిగిలిన మాసాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే స్వామివారి గోధుమ నూక ప్రసాదం తయారు చేసేవారు. దానిని మర్నాడు ఉదయం వరకూ విక్రయించేవారు. అయితే ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండో షిఫ్ట్‌లో ప్రసాదాలు తయారు చేసి, కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు.

ఫ తలుపులమ్మ లోవకు భక్తుల తాకిడి

ఫ జోరందుకోనున్న సత్యదేవుని ప్రసాద విక్రయాలు

ఫ అన్నవరంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement