మట్టి, ఇసుక అక్రమ దందా | - | Sakshi
Sakshi News home page

మట్టి, ఇసుక అక్రమ దందా

Jun 25 2025 6:48 AM | Updated on Jun 25 2025 6:48 AM

మట్టి

మట్టి, ఇసుక అక్రమ దందా

పి.గన్నవరం: కూటమి ప్రభుత్వ పాలనలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గ నేతల అండదండలతో మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండా లంక భూముల్లో పెద్ద ఎత్తున మట్టి, ఇసుక తవ్వకాలు చేస్తూ రూ.కోట్ల మేర దోచుకుంటున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని ఊడిమూడి, వైవీ పాలెం, పెదకందాలపాలెం, మానేపల్లి ర్యాంపుల్లో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

పెదకందాలపాలెంలో 7 లారీలు, 2 జేసీబీల స్వాధీనం

పెదకందాలపాలెం ర్యాంపులో పెద్ద ఎత్తున మట్టి, ఇసుకను తవ్వి టిప్పర్ల ద్వారా తరలించి విక్రయిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడి చేసి ర్యాంపునకు సమీపంలోని 6 ఖాళీ టిప్పర్లు, ఒక లోడు లారీని, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఐ వి.వర్మ లోడు లారీని పి.గన్నవరంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. లారీలు వెళ్లకుండా రోడ్డుపై వీఆర్వోను కాపలాగా ఉంచారు.

అధికారుల కళ్లుగప్పి డ్రైవర్ల పరారీ

లారీల స్వాధీనం అనంతరం కిలోమీటరు దూరంలో జేసీబీల కోసం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌పై వెళ్లారు. అప్పటికే అందిన సమాచారంతో రెండు జేసీబీలను తుప్పల చాటున దాచారు. వాటిని స్వాధీనం చేసుకుని, వెనక్కి వచ్చే సరికి ఇక్కడ ర్యాంపులోని ఆరు ఖాళీ టిప్పర్లతో డ్రైవర్లు పలాయనం చిత్తగించారు. తరలించిన టిప్పర్ల నెంబర్లతో పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ చెప్పారు.

అక్రమ తవ్వకాలపై కూటమి నేతల ఫిర్యాదు

పి.గన్నవరం అక్విడెక్టుకు దిగువన డీఎస్‌ పాలెం ర్యాంపులో కూటమి నేతల ఆధ్వర్యంలో గతంలో అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరిగాయి. కొన్ని నెలలపాటు మూతబడిన ఈ ర్యాంపును సోమవారం మళ్లీ ప్రారంభించారు. ఇదే అదనుగా ఎటువంటి అనుమతులూ లేకుండా ట్రాక్టర్లపై మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మంగళవారం టీడీపీ, జనసేనలకు చెందిన కొందరు నాయకులు డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్‌పాలెం ర్యాంపు సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్నప్పటికీ కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టి, ఇసుకను తరలించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించిన వారిలో కూటమి నేతలు పడాల వెంకటేశ్వరరావు, నేరేడిమిల్లి రఘు, సీహెచ్‌.ప్రసన్నకుమార్‌, కోట రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

అడ్డూ, అదుపూ లేకుండా తవ్వకాలు

రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు

మట్టి, ఇసుక అక్రమ దందా1
1/1

మట్టి, ఇసుక అక్రమ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement