
భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు
అమలాపురం రూరల్: స్కూల్ పిల్లలతో ప్రయాణించే ఆటోలు కచ్చితంగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆటోల్లో స్కూల్ పిల్లలను అధికంగా ఎక్కించినా, లగేజీ పెట్టే స్థానంలో పిల్లలు, ప్రయాణికులను కూర్చోబెట్టినా మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపే సమయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ అంశాలపై త్వరలో పోలీస్, విద్యా శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.