
రత్నగిరి జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
● 2500 వ్రతాల నిర్వహణ
● ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేలాదిగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం కేటాయించవలసి వచ్చింది. స్వామివారి దర్శనానంతరం అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. వ్రతమండపాలు, ఆలయప్రాకారం మధ్యాహ్నం వరకు భక్తుల తో నిండిపోయాయి. స్వామివారిని 50 వేల మంది దర్శించగా, 2,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదా యం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తు లు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు ఆలయంలో ఉల్లాసంగా గడిపారు.
ఘనంగా సత్యదేవుని రథసేవ
ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రాకారసేవ ప్రారంభించి రథసేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సూర్యనమస్కారాలు నిర్వహించారు.