
రండి... ఒలింపిక్ రన్కు..
అమలాపురం టౌన్: అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. రండి కలసి పరుగెడదామనే నినాదంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం ఒలింపిక్ రన్లు నిర్వహిస్తోంది. దీనిపై స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన తండ్రి దివంగత, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా అమలాపురంతోపాటు మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లను నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ఏడాది తన తండ్రి భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ జిల్లా ఒలింపిక్ రన్ స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటలకు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నుంచి రన్ను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒలింపిక్ టార్చ్ను వెలిగించి ప్రారంభిస్తారన్నారు. ఈ రన్ల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఽధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రన్లో అందజేయనున్న ఒలింపిక్ టీషర్టులను సాయిరాజ్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు కట్టా పురుషోత్తం, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.