
అయినవిల్లి... భక్తులతో శోభిల్లి
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో శోభిల్లింది. తొలుత ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 43 మంది, లక్ష్మీగణపతి హోమంలో 32 జంటలు, పంచామృతాభిషేకాల్లో ముగ్గురు జంటలు పాల్గొన్నాయి. పది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, ఎనిమిది మందికి తులాభారం, ముగ్గురికి అన్నప్రాసన జరిగాయి. 33 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.3,51,790 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకటదుర్గ భవాని తెలిపారు.