
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు
రామచంద్రపురం రూరల్: మండలంలోని వెంకటాయపాలెం శివారు చీమలదిబ్బ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుయ్యేరు గ్రామానికి చెందిన శీలం కమల(43) మృతి చెందినట్టు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. శీలం కమల బుధవారం వెంకటాయపాలెంలోని పేపకాయల బాబ్జీ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల అమ్మాయి ఓణీల ఫంక్షన్కి కుటుంబీకులు, బంధువులతో కలసి 5 మోటారు సైకిళ్లపై బయలుదేరారు. మరొక 5 నిమిషాల్లో కల్యాణ మండపానికి చేరుకుంటారన్న సమయంలో ఈమె ప్రయాణిస్తున్న వాహనం గోతిలో పడటంతో వెనుక కూర్చున్న కమల జారి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ద్రాక్షారామ నుంచి కుయ్యేరు వైపుగా వెళ్తున్న కోళ్లు సరఫరా చేసే లారీ చక్రాలు ఆమె పైనుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త సుమారు 2 సంవత్సరాలు క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరి పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. ఇంకా 9 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె ఆమైపె ఆధారపడి ఉన్నారు. ఆమె ద్రాక్షారామలో వస్త్ర దుకాణంలోలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కుమారుడు చిన్నతనం నుంచీ కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. కుమార్తెకు చిన్న వయస్సులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఆ చిన్నారుల పరిస్థితి తలచుకుని బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆసుపత్రి సమాచారం, బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.